
తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ( Salakatla Brahmotsavam ) కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ( Cultural performances ) విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బుధవారం ఉదయం తిరుమాడ వీధుల్లో విహరించిన చిన్నశేష వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్శించాయి. 9 రాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 20 కళాబృందాల నుంచి 539 మంది కళాకారులు తమ ప్రాంతాల కళా సంప్రదాయాలను ఆవిష్కరించారు. శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల కళాకారులు దేవేరులతో చిన్నశేష వాహనం, భరతనాట్యం, ఒడిస్సీ, గరగాటం తదితర కళారూపాలను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ కళాబృందాలు ఎదుకుల వైభవం, కోలాటం , పుదుచ్చేరి కళాకారులు ఒయ్యిళ్లాట్టం, ఉత్తరప్రదేశ్లోని వారణాసి కళాకారులు ప్రదర్శించిన శ్రీమద్రామాయణం, మహారాష్ట్ర కళాకారుల దగర్ గాజా, డ్రీమ్స్, అస్సాం కళాకారుల బోర్థాల్, పశ్చిమబెంగాల్ కళాబృందాల ఒడిసీ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బిహు, మంజునాథ చరితం, కాళింగ నర్తన, కోలాటం, తమిళ జానపదం తదితర కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు.





