
సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం యూఎల్‌సీ, ప్రభుత్వ భూముల్లో స్థలాల క్రమబద్ధీకరణకు పథకం ఇందిరమ్మ గృహాలకు ఐదేళ్లే లాకిన్‌ పీరియడ్‌ శాసనసభలో ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనున్నామని, సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 12 రకాల భూములు, భూ సంబంధిత సమస్యలు గుర్తించామని, ఆ సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారాలు చూపుతామని బుధవారం శాసనసభలో వెల్లడించారు. 1. అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ) భూములు పాక్షికంగా క్రమబద్ధీకరించినవి, క్రమబద్ధీకరించని కాలనీలు: యూఎల్‌సీ మిగులు భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కొత్త విధానం తీసుకువస్తుంది. ఈ విధానం పెండింగ్‌లోని దరఖాస్తులతో పాటు కొత్తవాటికి కూడా వర్తిస్తుంది. క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్‌ రెండూ ఏకకాలంలో పూర్తిచేస్తాం. 2. అధీకృత లేఅవుట్లలో ప్రభుత్వ భూములు (హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ): అధీకృత లేఅవుట్లలో ప్రభుత్వ భూములు ఉంటే.. అందులోని పెండింగ్‌ రిజిస్ట్రేషన్ల పరిష్కారం కోసం వారం రోజుల్లో సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఈ ఆస్తులతోపాటు ప్రభుత్వ భూముల్లో వెలిసిన అనధికార లేఅవుట్లు, కాలనీలను నూతన క్రమబద్ధీకరణ పథకం పరిధిలోకి తీసుకువస్తాం. వారం రోజుల్లో విధివిధానాలు జారీ చేస్తాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ వేస్తాం. అందులో సీసీఎల్‌ఏ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఉంటారు. ఈ కమిటీ సమావేశమై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటుంది. 3. సింగరేణి బొగ్గుగని ప్రాంతాలు: అక్కడ సింగరేణి కాలనీల్లో కొందరికి పట్టాలు ఇచ్చారు. కొందరికి ఇవ్వలేదు. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాస్థాయి ఉన్నతాధికారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తాం. పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించి అర్హతల మేరకు కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. సింగరేణి యాజమాన్యం, కలెక్టర్లు, కార్మిక సంఘాలు కలసి ఈ సమస్యలు పరిష్కరించుకోవాలి. 4. జీవోనం.59 సమస్య : హక్కు బదిలీ పత్రాలు జారీ చేసిన 1,22,280 దరఖాస్తులను నిర్దేశిత అర్హత ప్రాతిపదికన తుది పరిశీలన చేసి పరిష్కరించేందుకు కమిటీని నియమిస్తాం. మిగిలిన 18,590 పెండింగ్‌ దరఖాస్తులను నూతన విధానం కింద పరిష్కరిస్తాం. 5. ఎల్‌.బి.నగర్‌లో జీవోనం.118 భూములు: అక్కడ పెండింగ్‌లోని దరఖాస్తులన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తాం. దాదాపు 9,500 మంది బాధితులున్నారు. వారి స్థలాలను రెగ్యులరైజ్‌ చేసి, 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం. మునుగోడు ఉప ఎన్నిక ముందు అప్పటి ప్రభుత్వం ఈ స్థలాల క్రమబద్ధీకరణకు జీవో ఇచ్చినా.. అది అమలు కాలేదు. 6. ఎసైన్డ్‌ భూముల్లో నిర్మించిన గృహాలు: ఎసైన్డ్‌ భూముల్లో నిర్మించుకున్న గృహాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపడతాం. ఎసైన్డ్‌ భూములన్నీ తెలంగాణ ఎసైన్డ్‌ చట్టం 1977 పరిధిలోకి వస్తున్నందున ఈ అంశంపై సమగ్ర న్యాయ సమీక్ష, విస్తృత స్థాయి సంప్రదింపులు నిర్వహిస్తాం. 7. ఇందిరమ్మ పథకం: ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇందిరమ్మ గృహాలు అంత్యంత నిరుపేదలకు సంబంధించినవి. దీనిపై విస్తృతస్థాయి సంప్రదింపులు నిర్వహిస్తాం. 8. ఇందిరమ్మ గృహాలు: లబ్ధిదారు సొంత స్థలంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇందిరమ్మ గృహాలకు ఐదేళ్ల లాకిన్‌ పీరియడ్‌ అనంతరం క్రయవిక్రయాలకు అనుమతిస్తాం. 9. ప్రైవేటు పట్టాభూములు.. నాలా చెల్లించని కేసులు: నాలా రుసుం, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుములను చెల్లించి క్రయవిక్రయాలు చేసుకోవచ్చు. ఈ రుసుము స్వల్పంగా ఉంటుంది. 10. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, అనధికార లేఅవుట్లు, కాలనీలు: ఈ తరహా అనధికార లేఅవుట్లను నూతన క్రమబద్ధీకరణ పథకం పరిధిలోకి తీసుకువస్తాం. 11. సికింద్రాబాద్‌ పరిధిలోని లీజ్‌హోల్డ్‌ ఆస్తుల క్రమబద్దీకరణ: ఈ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 30 రోజుల వ్యవధిలోగా అధికారులతో కమిటీ నియమిస్తాం. 12. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల ఎసైన్డ్, భూదాన్‌ భూములు: పేద, బలహీన వర్గాల గృహనిర్మాణ అవసరాల నిమిత్తం భూమిని, ఆర్థిక వనరులను సమీకరించే ఉద్దేశంతో సమగ్ర ల్యాండ్‌ పూలింగ్‌ విధానం పరిధిలోకి తీసుకువస్తాం. ఈ విధానం ద్వారా సమీకరించిన నిధులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నిరుపేదలకు, బలహీనవర్గాల వారికి గృహ నిర్మాణ పథకాల కోసం వినియోగిస్తాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




