
ఏపీలోని ప్రజలకు ప్రభుత్వం ఊరట కలిగించింది. ప్రభుత్వ సేవలు, సంక్షేమ ప్రయోజనాలు, సబ్సిడీలు పొందేందుకు ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఆధార్ లేదనే కారణంతో సేవలు నిరాకరించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మీ సేవ కేంద్రాల నిర్వహకులను కూడా ఆదేశించింది. ఆధార్ అనేది ఆప్షనల్ మాత్రమేనని, తప్పనిసరి కాదని తెలిపింది. స్వచ్చంధంగా ఆధార్ ఇస్తేనే తీసుకోవాలని, లేకపోతే ఇతర గుర్తింపు ధృవీకరణ పత్రాలను వెరిఫికేషన్ ప్రక్రియ కోసం ఉపయోగించుకోవాలని సూచించింది. ఆధార్ లేదనే కారణంతో ప్రభుత్వ సేవలు అందించకపోవడం లాంటివి చేయకూడదని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.



