
భారత్, పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తమ దేశ నీటి భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్తో యుద్ధానికి కూడా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. సింధు నదీ పరివాహక ప్రాంత నీటిపై తమకున్న హక్కులకు భంగం కలిగితే, సైనిక చర్యకు దిగడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న జలాల ఒప్పందంపై నెలకొన్న సందిగ్ధత ఇరు దేశాల మధ్య నూతనఉద్రిక్తతలకు కారణమవుతోంది.జాతీయ భద్రతా అంశం..ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. 2028 జూన్ నాటికి పాకిస్తాన్ కు వెళ్లే సింధు నదీ జలాలను పూర్తిగా నిలిపివేయవచ్చని జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సింధు నదీ జలాల వ్యవహారాన్ని తమ దేశ మనుగడకు సంబంధించిన జాతీయ భద్రతా అంశంగా అభివర్ణించారు. జలాల ప్రవాహాన్ని నియంత్రించడానికి భారత్ వేగంగా అడుగులు వేస్తోందని ఆరోపించారు. సింధు జలాల ఒప్పందం రద్దు నేపథ్యం..పాకిస్తాన్ తో 1960లో కుదిరిన చారిత్రక సింధు జలాల ఒప్పందాన్ని.. గత ఏడాది ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. నాటి దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపనంత వరకు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్రం ఖరాకండిగా చెప్పింది. అప్పటి నుంచి ఈ ఒప్పందం నిలిచిపోయింది.విపరీతమైన నీటి కొరత..ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థలోని దాదాపు 80 శాతం నీటి వాటాను పాకిస్తాన్ కు కేటాయించారు. వ్యవసాయం, సాగునీటితో పాటు పాక్ ఆర్థిక జీవనాడి అంతా ఈ నదీ పరివాహకంపైనే ఆధారపడి ఉంది.