
వ్యాపార సంస్థలు తమ వస్తువులను, సేవలను ప్రచారం చేసుకోవడం వ్యాపార వృద్ధికి అవసరం. కానీ ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వాలు తమ గురించీ, తమ పథకాల గురించీ విపరీతంగా ప్రచారం చేసుకోవడం, దానికోసం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడం సమంజసమేనా? 2026–27లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు రూ. 75,868 కోట్లు (జీఎస్డీపీలో 3.8%). కేంద్ర ఆర్థిక సంఘం నిర్దేశించిన 3% పరిమితిని మించిపోయింది. మొత్తం బకాయి అప్పులు జీఎస్డీపీలో 36% వద్ద ఉన్నాయి. రెవెన్యూ లోటు 1.1%. ఏటా వేల కోట్ల అప్పు తీసుకుంటూ, కేంద్ర గ్రాంట్లపై అధికంగా రాష్ట్రం ఆధారపడుతోందని కాగ్ నివేదికలు, బడ్జెట్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంత తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలోనూ ప్రచార ఖర్చులు తగ్గకపోగా పెరగడం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, పాలనా విజయాల ప్రచారం కోసం విపరీతంగా ఖర్చు చేస్తోంది. 2025 సెప్టెంబర్ 10న అనావృష్టి పీడిత అనంతపురంలో ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభ ఈ ప్రచార పర్వానికి నిదర్శనం. హామీలు పూర్తిగా నెరవేరకుండానే విజయోత్సవం జరుపుకోవడాన్ని ‘పీఆర్ మాయాజాలం’. పెట్టుబడులను ఆహ్వానించే పేరుతో 2025 నవంబర్ 14–15న విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ను ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ‘ముందుగా సిద్ధం చేసిన ప్రచార ప్రహసనం’గా అభివర్ణించింది. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు కర్మాగారం వంటి ప్రాజెక్టుల పునరుద్ధరణను హడావుడిగా ప్రచారం చేయడం, దావోస్లో రూ. 10 లక్షల కోట్ల హరిత ఇంధన పెట్టుబడుల వాగ్దానం గురించి ప్రచారం చేయడం కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో ఊహించడం కష్టమేమీ కాదు. సుప్రీం కోర్టు ఏం చెప్పింది? ఈ ఖర్చులు కేవలం దుబారా మాత్రమే కాదు, చట్టపరమైన నిబంధనలకూ విరుద్ధం. 2015 మే 13న ‘కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (రిట్ పిటిషన్ నం. 13/2003) కేసులో జస్టిస్