
నాన్నంటే క్యాలెండర్లో ఒక రోజు కాదు. నాన్న నిన్న, నేడు, రేపు . మన ప్రతి ఊపిరి. నాన్న ఉన్నాడనే ధైర్యం. నాన్న ఉంటాడనే నమ్మకం. వాస్తవంలో భుజం తట్టినా ఊహల్లో గుండెకు హత్తుకున్నా ఆ స్పర్శ ఒక్కటే చాలు. ‘నాన్నా’.. ఆ పిలుపులో విశ్వమే ఒదుగుతుంది. ‘కన్నా’.. ఆ బదులులో పెన్నిధే దొరుకుతుంది. ఎన్నటికీ ముగియని పాఠం నాన్న. ఎప్పటికీ వదలని చేయి నాన్న. ‘నాన్నా’.. నిన్ను తలుస్తూనే బతుకుతాం. ‘నాన్నా’.. నిన్ను కొలుస్తూనే నడుస్తాం. ఆ పద్యాల్లోని మాధుర్యం వినిపిస్తూనే ఉంది... మా నాన్నపేరు పిల్లా సత్యం నాయుడు. మాది ఉమ్మడి కుటుంబం. మా తల్లిదండ్రుల అమ్మానాన్నలు కూడా మాతోనే ఉండేవారు. మాకున్న కాస్త పొలంలోనే వ్యవసాయం చేసేవారు. మా నాన్నకి, బాబాయ్కి బాగా చదువుకోలేకపోయామని బాధ ఉండేది. అందుకే నన్ను చదువుపై దృష్టి పెట్టమని పదేపదే చెప్పేవారు. మా నాన్న పౌరాణిక ప్రేమికుడు. భారత, భాగవత,రామాయణాలలోని పద్యాలు అలవోకగా చదివి అర్థాలు చెప్పేవారు. మా ఊరిలో ఎగువ, దిగువ వీధుల్లో రెండు రామ మందిరాలు ఉండేవి. ప్రతి ఏడాది కార్తీక, మాఘ మాసాలలో పురాణ కాలక్షేపం జరిగేది. అరణ్యపర్వం, విరాటపర్వం, ఉద్యోగపర్వాలు, సుందరకాండ, యుద్ధకాండ, గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర, భగవద్గీతలలో పద్యాలను శృతిబద్ధంగా పాడుతూ అందులోని అర్థ, పరమార్థాలను విపులంగా వివరించేవారు. నాన్నతో పాటు పెద్దనాన్న కూడా పద్యాలు పాడేవారు. కరువు సంభవించినప్పుడు ఊరిలోని వెంకయ్య కోనేరు గట్టున, మర్రిచెట్టు కింద పది రోజులు పాటు విరాటపర్వం చెప్పేవారు. సరిగ్గా ఉత్తర గోగ్రహణం చెప్పే సమయానికి చినుకులు మొదలయ్యేవి. నాన్న ప్రోద్బలంతో చదివిన నేను ఉపాధ్యాయుడినయ్యాను. కాని చిన్నప్పటి నుంచి భాగవతం, పురాణాలు విని, వారి వెంట వెళ్లి నాకు కూడా పద్యాలు పాడడం అలవాటైపోయింది. నాన్న పురాణం చెప్పడానికి ఎక్కడికి వెళ్లినా వ్యాసపీఠం నేనే మోసుకెళ్లేవాడిని. ఇప్పడు భౌతికంగా ఆయన లేకపోయినా కోడికూత కంటే ముందే