
మహాశివరాత్రికి సిద్ధం కానున్న సోమేశ్వరాలయం అనంతసాగరం, న్యూస్‌టుడే: సోమశిల జలాశయం వద్ద కొలువైయున్న శ్రీ సోమేశ్వరస్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 2021లో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరదల కారణంగా సోమశిల డ్యామ్‌ పరిసరాలతో పాటు ఆలయానికి చెందిన పలు నిర్మాణాలు, మండపాలు, ప్రాకారాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆలయ పునర్నిర్మాణం కోసం భక్తులు, స్థానికులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో దేవాలయాల నిర్మాణాలు నత్తనడకన సాగాయని ఆరోపణలు బలంగా ఉన్న నేపథ్యంలో సోమేశ్వరాలయ పునర్నిర్మాణానికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం చంద్రబాబు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఆలయ నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరు చేశారు. అనంతరం గోపురం, అమ్మవారి ఆలయ నిర్మాణం, ఇతర వాటి కోసం మరో రూ.14 కోట్లకు పైగా నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో పనులు వేగం పుంజుకున్నాయి. ఆలయ నిర్మాణంలో నాణ్యమైన నల్లరాయిని వినియోగిస్తున్నారు. చెన్నై నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన నల్లరాతితో అనుభవజ్ఞులైన శిల్పులు, నిపుణులు ఆలయ నిర్మాణ పనులు చేపడుతున్నారు. స్వామివారి మూల విరాట్టు.. స్వయంభు లింగమును ఏమాత్రం కదిలించకుండా నిర్మాణ పనులు చేపట్టడం విశేషం. ధ్వజస్తంభం, నంది విగ్రహాన్ని తొలగించి, పాత ఆలయ నమునాను ఆధారంగా చేసుకుని ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా పునర్నిర్మాణం సాగుతున్నట్లు పండితులు, ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ వెల్లడించారు. ఆలయానికి ముందు, ఎడమ వైపున ద్వారాలు, అమ్మవారి ఆలయం, చుట్టూ ప్రహరీ, గాలి గోపురం తదితర నిర్మాణాలు చేపడుతున్నారు. నిర్మాణ పనులు మహాశివరాత్రి నాటికి పూర్తి చేసి భక్తులకు ఆలయాన్ని అందుబాటులోకి తీసుకు రావాలనే లక్ష్యంతో అధికారులు, నిర్మాణ సంస్థ కసరత్తు చేస్తున్నారు. ఆలయం పూర్తయితే సోమశిల ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యం మరింత పెరుగుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




