
సర్కారు నిర్ణయాలపై ఉద్యోగుల్లో ఉత్కంఠ ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో 18న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఆధ్వర్యంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ బుధవారం ఆయా సంఘాల అధ్యక్షులు, సెక్రటరీలకు లేఖ రాసింది. సచివాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 9న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అందులో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాల సమస్యలపై చర్చ జరగనుంది. పీఆర్‌సీ నివేదిక అమలు, పెండింగ్‌ డీఏల విడుదల, సీపీఎస్‌ రద్దు తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. సమావేశం నాటికి పీఆర్‌సీ నివేదిక సర్కారుకు అందుతుందా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు డీఏలు ప్రకటించవచ్చని, సీపీఎస్‌ అంశంపై కమిటీని నియమించే అవకాశం ఉందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆరోజు ప్రభుత్వం ప్రకటించే నిర్ణయాల ఆధారంగా మరుసటి రోజు ఉద్యోగుల ఐకాస సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





