
దేశమంతా ప్రజలు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాలు చేసుకుంటున్న సమయంలో... హైదరాబాద్‌ సంస్థానం మాత్రం నిజాం నిరంకుశ పాలనలోనే ఉండిపోయింది. ఇక్కడి ప్రజలు స్వేచ్ఛ కోసం పోరాడారు. రజాకార్ల దమనకాండను ఎదుర్కొన్నారు. వేలాది మంది ప్రాణ త్యాగాలు చేశారు. అనేక కుటుంబాలు తమ సర్వస్వాన్ని కోల్పోయాయి. చివరికి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఉక్కు సంకల్పంతో చేపట్టిన ‘ఆపరేషన్‌ పోలో’తో 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో కలిసింది. ఇంతటి చారిత్రక ఘట్టానికి ఇన్నాళ్లుగా సరైన గుర్తింపు దక్కలేదు. అందుకు బాధ్యులైన వారి నుంచి దానికి ఎలాంటి సంజాయిషీ లేదు. చా రిత్రక సంఘటనలను మర్చిపోవడం ఒక విషయం. కానీ.. చరిత్రను దురుద్దేశపూర్వకంగా మరుగునపరచడం నేరం. హైదరాబాద్‌ సంస్థానం విమోచన విషయంలో దశాబ్దాలుగా ఇదే జరిగింది. కేంద్రంలో వరుసగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, 2014 తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు... సెప్టెంబర్‌ 17కు, ఈ నేలపై జరిగిన స్వతంత్ర పోరాటానికి, అందులో పాల్గొన్న మహనీయుల త్యాగాలకు అధికారిక గుర్తింపు ఇవ్వలేకపోయాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్‌ సంస్థానం ప్రజలు పదమూడు నెలలపాటు నిజాం, రజాకార్ల క్రూర పాలనలో మగ్గాల్సి వచ్చింది. ఆ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం వంటిది దేశ చరిత్రలో మరెక్కడా జరగలేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో! ఇది ఒక ప్రాంతం భారతదేశంలో చేరిన కథ కాదు. ఇది ప్రజలు తమ స్వేచ్ఛకోసం, ఆత్మగౌరవంకోసం, ప్రజాస్వామ్య హక్కులకోసం, భవిష్యత్తు తరాల బాగుకోసం చేసిన పోరాటాల గాథ! నిజాం పాలనకు వ్యతిరేకంగా సమాజంలోని అనేక వర్గాలు తమదైన రీతిలో పోరాడాయి. చాకలి ఐలమ్మ వంటి వీరనారులెందరో తమ ధైర్యసాహసాలతో చరిత్రలో నిలిచారు. కాళోజీ నారాయణరావు తన కలంతో నిరంకుశత్వాన్ని ప్రశ్నించారు. దాశరథి తన పద్యాలతో ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపారు. నారాయణరావు పవార్‌ వంటి యోధులు నిజాం పాలనకు ఎదురొడ్డి నిలబడ్డారు. షోయబుల్లాఖాన్‌ వంటి పాత్రికేయులు కూడా రజాకార్ల దౌర్జన్యాలను ధైర్యంగా ప్రశ్నించి, బలిదానాలు చేశారు. అందుకే... ఇది ఏ ఒక్క మతమో వర్గమో చేసిన పోరాటం కాదు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛా పోరాటమిది. ఇంతటి ఘనమైన చరిత్రను సంతుష్టీకరణ, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తొక్కిపెట్టడాన్ని, ప్రజల త్యాగాలను తక్కువచేసి చూపించే ప్రయత్నం చేయడాన్ని ఎవరూ హర్షించరు. నాడు 1947, 1948 సంవత్సరాల్లో హైదరాబాద్‌ సంస్థానంలో రోజురోజుకూ పరిస్థితులు విషమిస్తున్నాయి. నిజాం తన స్వతంత్ర రాజ్యాన్ని, నియంత పాలన కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. అవసరమైతే పాకిస్థాన్‌లో విలీనమయ్యేందుకు చర్చలు జరుపుతున్నాడు. హైదరాబాద్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి లేఖ కూడా రాశాడు. మరోవైపు ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు తెలంగాణ ప్రజలపై దమనకాండకు పాల్పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిజాం రాజ్యంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడమే కాదు... దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ గుర్తించారు. భారత సైన్యాన్ని రంగంలోకి దించి 1948 సెప్టెంబర్‌ 13న ‘ఆపరేషన్‌ పోలో’ చేపట్టారు. నాలుగు దిక్కులనుంచి హైదరాబాద్‌ సంస్థానాన్ని సైనిక చర్యతో దిగ్బంధించడంతో నాలుగు రోజుల వ్యవధిలోనే నిజాం సైన్యం, రజాకార్లు లొంగిపోయారు. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో చేరింది. అప్పటివరకు విర్రవీగిన నిజాం... బేగంపేట విమానాశ్రయంలో పటేల్‌ ముందు తలవంచక తప్పలేదు. అందుకే... పటేల్‌ సంకల్పశక్తిని, తెలంగాణ ప్రజల పోరాటాన్ని, అమరవీరుల త్యాగాలను, భారతదేశ సమైక్యతను గుర్తుచేసుకోవడానికి సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించుకోవడం చారిత్రక అవసరం. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను భావితరాలకు పరిచయం చేయడంలో దశాబ్దాలుగా కొనసాగిన నిర్లక్ష్యానికి ముగింపు పలికింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా... దేశ చరిత్రలో మరుగునపడిన అనేక అధ్యాయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌ విమోచన పోరాటానికీ సరైన గౌరవాన్ని కల్పించింది. 2022 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని కేంద్రప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహించేందుకు నిర్ణయించింది. విమోచన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమర వీరులకు నివాళులర్పించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. త్యాగధనులను స్మరించుకోవడం, యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపడమే విమోచన దినోత్సవ నిర్వహణ ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం సంబంధిత గెజిట్‌లో పేర్కొంది. చరిత్రను ఎంతకాలం దాచినా... ప్రజల జ్ఞాపకాల్లోని సత్యాన్ని చెరిపేయలేరు. సెప్టెంబర్‌ 17ను రాజకీయ కళ్లద్దాలతో చూడాల్సిన అవసరం లేదు. చరిత్ర కళ్లతో చూడాలి. అమరవీరుల త్యాగాలు, తెలంగాణ ప్రజల స్వేచ్ఛాకాంక్ష, భారతదేశ సమైక్యత కోణంలో చూడాలి. బైరాన్‌పల్లి వంటి ఘటనలు, పరకాల వంటి పోరాట ఘట్టాలు, నిర్మల్‌ ప్రాంత వీరుల త్యాగాలు, రాంజీగోండు, కుమురం భీంల పౌరుషం, చాకలి ఐలమ్మ ధైర్యం, కాళోజీ కలం, దాశరథి గళం, షోయబుల్లాఖాన్‌ త్యాగం, నారాయణరావు పవార్‌ పోరాటం, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ సాహసం... ఇవన్నీ తెలంగాణ విమోచన చరిత్రలో కీలకమైనవి. ఇంతటి ఘన చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, సమాజానిది, మనందరిది. తెలంగాణ విమోచన కోసం పోరాడిన ప్రతి వీరుణ్నీ స్మరించుకుందాం, వారికి నివాళులర్పిద్దాం, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చరిత్రాత్మక పాత్రను గుర్తుచేసుకుందాం. రాజకీయ కుట్రలకు ముగింపు పలికి, చరిత్రకు తగిన గౌరవం ఇచ్చిన ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




