
దేశ రాజధాని దిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 20న ప్రారంభమైన ఆందోళనలు 11 రోజులుగా సాగుతున్నాయి.
దేశ రాజధాని దిల్లీ వేదికగా జంతర్ మంతర్‌ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 20న ప్రారంభమైన ఆందోళనలు 11 రోజులుగా సాగుతున్నాయి. నీట్- యూజీ 2026 పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీక్ లకు బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేశారు. మరోవైపు ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ఇదే ప్రాంగణంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి ఇప్పటికి మూడు రోజులు అవుతుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. సోనమ్ వాంగ్ చుక్ షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు తెలుస్తోంది.మరోవైపు గత మూడు రోజులుగా వాంగ్‌ చుక్ కేవలం నీళ్లు మాత్రమే తీసుకుంటూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. వాంగ్ చుక్ ఆరోగ్యం మరింత క్షీణిస్తే పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని దిప్కే ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే జంతర్ మంతర్‌ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.ఆందోళనలు చేసే ప్రదేశం వద్ద పోలీసులు భారీగా మోహరించారని అన్నారు. ఆందోళనల్లో స్వచ్చందంగా పాల్గొనేందుకు వస్తున్న విద్యార్థులు, యువత, రైతు నాయకులను నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి సపోర్టర్స్ రాకుండా ట్రావెల్ రూట్స్ ను కూడా బ్లాక్ చేశారని తెలిపారు. ఇక్కడికి ఎవరినీ రానివ్వకుండా వాళ్లు ఏం చేయాలని ఫిక్స్ అయ్యారని ప్రశ్నించారు.పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని మరోసారి ఆందోళనకారులు స్పష్టం చేశారు. అలాగే తమ డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఈ ఉద్యమంలో చేరి తమకు మద్దతుగా నిలవాలని కోరారు.