
High Wind Alert : ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు యాక్టివ్ అయ్యాయి. ఇదే సమయంలో ఓ అల్పపీడనం కొనసాగుతోంది. వీటికి ఉపరితల ఆవర్తనం, ద్రోణి తోడయ్యాయి.
వీటన్నింటి ప్రభావంతో అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి… జూలై ఆరంభంలో ఈ వానలు తీవ్రరూపం దాల్చనున్నాయట.. భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో వాతావరణ పరిస్థితుల గురించి తెలంగాణ వెదర్ మ్యాన్ ఆసక్తికర ప్రకటన చేశారు... ఇది ప్రజలను కాస్త కంగారుపెట్టేలా ఉంది.
రాబోయే ఐదారు రోజులు తెలంగాణవ్యాప్తంగా ఈదురుగాలుల బీభత్సం కొనసాగనుందని వెదర్ మ్యాన్ వెల్లడించారు. బలమైన అల్పపీడనం కారణంగా గాలుల తీవ్రత ఎక్కువ కానుందని... ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇప్పటికే ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి... జూలై 2 నుండి 5వ తేదీ వరకు ఈ గాలులు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
కేవలం జిల్లాల్లోనే కాదు హైదరాబాద్ నగరంలోనూ గాలులు బీభత్సం తప్పదని హెచ్చరిస్తున్నారు వెదర్ మ్యాన్ బాలాజీ. నగరంలో భారీ హోర్డింగ్ లో, ప్లెక్సీలు, టవర్లు జనావాసాల మధ్య ఉంటాయి.. కాబట్టి ఈ ఈదురుగాలులతో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందంటున్నాారు. కరెంట్ పోల్స్ దెబ్బతినడం, విద్యుత్ తీగలు తెగిపడటం, చెట్ల కొమ్మలు విరిగిపడటం వల్ల ప్రమాదాలు జరగొచ్చు… కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండలని వెదర్ మ్యాన్ సూచిస్తున్నారు.
తెలంగాణలో కేవలం ఈదురుగాలులే కాదు భారీ వర్షాలు కూడా ఉంటాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక మిగతా తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయిని ప్రకటించారు. రాబోయే ఆరు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. జూన్ లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు... కానీ జూలైలో ఇలా ఉండదు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణలో ఇప్పటికే జోరు వానలు పడుతున్నాయి... అయితే ఇవాళ (జూన్ 30, మంగళవారం) ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఈ వర్షాలు రేపటికి మరిన్ని జిల్లాలకు విస్తరించే అవకాశాలున్నాయంటోంది. జూలై 1న (బుధవారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. మిగతా జిల్లాలో చెదురుమదురు జల్లులు ఉంటాయని.. అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణ జిల్లాలన్నింటిలో ఈదురు గాలులు వీస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరించింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఈ రోజంతా (జూన్ 30) ఆకాశం మేఘాలతో కమ్మేసి ఉంటుంది... చల్లగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే తెలంగాణ జిల్లాల్లో మాదిరిగానే నగరంలో కూడా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం... నిన్న (జూన్ 29, సోమవారం) అత్యధికంగా ఖమ్మం జిల్లా బోనకల్ లో 94.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక నిజామాబాద్ జిల్లాలోని మోస్రాలో 83.2, సిర్కొండలొ 76.1, ధర్పల్లిలో 72, నవిపేటలో 71.5,యేడపల్లెలో 70.9 మి.మీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా మల్లల్ లో 74.1, మడిపల్లెలో 67.9, ములుగు జిల్లా ఏటూరునాగారంలో 71.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
ఇవాళ (జూన్ 30, మంగళవారం) ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురు జల్లులు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
పిడుగులు, ఈదురుగాలులతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే చెట్ల కింద, పోల్స్ దగ్గర ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు చెరువులు, ఫౌంటైన్లు, స్విమ్మింగ్ పూల్స్ వంటి నీటి వనరులకు, బహిరంగ ప్రదేశాలకు ఎంత దూరంగా ఉంటే అంత సురక్షితంగా ఉంటారని ప్రఖర్ జైన్ ప్రజలకు సూచించారు.