
ఏపీ హోంమంత్రి అనితను ఉద్దేశించి 'మేకప్ మంత్రి' అంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.
ఉన్నత స్థానంలో ఉన్న ఒక మహిళా మంత్రిపై నీచమైన కామెంట్లు చేశారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు, గుడివాడ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించింది. అయితే, విచారణకు హాజరు కావడానికి ఆయన ఇప్పటికే రెండు సార్లు గడువు కోరారు. ఈరోజు ఆయన విచారణకు హాజరుకానున్నారు.మరోవైపు, హోంమంత్రి అనితపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అమర్నాథ్ వివరణ ఇచ్చారు. తాను ఎక్కడా మహిళలను తక్కువ చేసి మాట్లాడలేదని, ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు సాధారణం అని చెప్పుకొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించి.. టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలపై గౌరవంతోనే తాను మహిళా కమిషన్ ముందుకు వస్తున్నట్లు చెప్పారు. గతంలో హోంమంత్రి అనిత.. వైసీపీ నేతలపై, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ పై చేసిన పాత వ్యాఖ్యల తాలూకు వీడియో ఫుటేజ్లను కమిషన్ ముందు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.