ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్ర కథానాయకుడు అఖిల్ రాజ్ ఉద్దెమరి సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు.
ఒక ఫుడ్ డెలివరీ బాయ్పై ఆయన భౌతిక దాడికి ప్రయత్నించినట్లు చూపుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అసలేం జరిగింది?వైరల్ అవుతున్న విజువల్స్ ప్రకారం.. సదరు డెలివరీ బాయ్ పొరపాటున రాంగ్ అడ్రస్కు పార్సిల్ తీసుకువచ్చాడు. తన పొరపాటును గ్రహించి అతను క్షమాపణలు కోరినప్పటికీ, హీరో అఖిల్ రాజ్, అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. బిల్డింగ్ మెట్లపై నుంచి కిందకు వస్తున్న డెలివరీ బాయ్ వైపు హీరో కోపంతో దూసుకురావడం, అతనిని కొట్టడానికి ప్రయత్నించడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న కొందరు మహిళలు అఖిల్ను వారించే ప్రయత్నం చేసినా ఆయన శాంతించలేదు. సదరు డెలివరీ బాయ్ స్వయంగా ఈ దృశ్యాలను రికార్డ్ చేస్తూ తన ఆవేదనను పంచుకున్నాడు. తాను సారీ చెప్పినా వినకుండా హీరో తనపై దౌర్జన్యానికి దిగాడని, అంతటితో ఆగకుండా హీరో తల్లి తన ముఖంపై ఉమ్మివేసి తీవ్రంగా అవమానించిందని అతను ఆరోపించాడు. నెటిజన్ల ఆగ్రహం ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు సదరు హీరో ప్రవర్తనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిత్యం కష్టపడే డెలివరీ బాయ్స్ పట్ల ఇలాంటి అహంకారపూరిత వైఖరి తగదంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ప్రస్తుతం కేవలం డెలివరీ బాయ్ వైపు ఉన్న వీడియో మాత్రమే బయటకు వచ్చినందున, అసలు గొడవకు దారితీసిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై హీరో అఖిల్ రాజ్ లేదా అతని కుటుంబ సభ్యులు స్పందిస్తేనే అసలు నిజాలు వెలుగుచూస్తాయి.* యూట్యూబ్లో బెల్లంకొండ ప్రభంజనం.. 100 కోట్ల వ్యూస్తో సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఖూన్ఖార్’పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ, కఠిన శ్రమ తర్వాత అఖిల్ రాజ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన.. ముందుగా మీడియాలో యాంకర్గా, ఫొటోగ్రాఫర్గా పనిచేశారు. 'సఖియా', 'ఏవండోయ్ ఓనర్ గారు' వంటి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రతిభను చాటుకుని, ఆపై ఓటీటీలో విడుదలైన 'విందు భోజనం' అనే సినిమాతో మెప్పించారు. గతేడాది తెలంగాణ నిజ జీవిత సంఘటన నేపథ్యంలో వచ్చిన 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రం ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. కేవలం రూ.2.5 కోట్ల స్వల్ప బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి, సూపర్ హిట్గా నిలిచింది. ఈ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా రెండు నెలల పాటు డప్పు కొట్టడం కూడా నేర్చుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'స్మాల్ టౌన్ బాయ్స్' చిత్రంతో పాటు అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్లతో కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్లు ఉన్నాయి. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఇలాంటి వివాదాలు ఆయన ఇమేజ్పై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.