తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన మరో గొప్ప కార్యక్రమం శ్రీవారి వైద్య సేవ. ఈ కార్యక్రమం కింద టీటీడీ ఆస్పత్రులలో స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లకు టీటీడీ అవకాశం కల్పిస్తోంది.
శ్రీవారికి సేవ చేయాలనుకునే వైద్యులు ఈ రకంగా తమకు చేతనైన సాయం అందించేందుకు టీటీడీ ఈ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. ఈ క్రమంలోనే మానవసేవే మాధవ సేవగా భావించి.. పలువురు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, ఎంబీబీఎస్ వైద్యులు శ్రీవారి వైద్య సేవ లో పాల్గొని రోగులకు సేవలు అందిస్తున్నారు. గుంటూరుకు చెందిన డాక్టర్ ధనుంజయ కూడా అదే రీతిలో శ్రీవారి వైద్య సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అనుభవాన్ని, అభిప్రాయాలను పంచుకున్నారు. శ్రీవారికి ఈ రకంగా సేవ చేసే భాగ్యం రావటం తన అదృష్టమంటున్నారని చెప్తున్నారు."గుంటూరులో 50 ఏళ్లుగా పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నా. శ్రీవారి వైద్య సేవ ప్రారంభిస్తే బాగుంటుందని నా మదిలో ఉండేది. ఓ రోజు అనుకోకుండా పేపర్లో ప్రకటన చూశా. వెంటనే పద్మావతి హృదయాలయానికి అప్లై చేశా. నాకు ఇదో గొప్ప అవకాశం. ఇక్కడికి వచ్చాక చాలా మంది చిన్నారులను, వారికి అందుతున్న వైద్యాన్ని చూశా. ఎంతోమందికి ఉచితంగా వైద్యం అందిస్తుండటం డాక్టర్గా నాకే ఆశ్చర్యమేస్తోంది. బాలమందిర్లో నేను వేరే ప్రపంచాన్ని చూశా. 50 ఏళ్ల నా ప్రాక్టీసులో అలాంటిది నేను చూడలేదు. 200 మంది పిల్లలు ఉన్నారక్కడ. వారికి అమ్మానాన్న లేరు. వారెంత ఆనందంగా ఉన్నారంటే.. వాళ్ల తల్లిదండ్రుల వద్ద ఉన్నాకూడా అంత ఆనందంగా ఉండరనే విధంగా.. అంత గొప్పగా అక్కడి సిబ్బంది పిల్లలను చూస్తున్నారు. శ్రవణంలో ఉన్న పిల్లలను చూస్తే మరింత ఆశ్చర్యంగా అనిపించింది. 10 లక్షల విలువైన సర్జరీని ఉచితంగా చేస్తూ.. తల్లీపిల్లలను సంరక్షిస్తున్నారు. ఈ విధంగా ఆ వేంకటేశ్వరస్వామే వైద్యం చేసేందుకు నాకు అవకాశం కల్పించారు. " అని డాక్టర్ ధనుంజయ్ చెప్పుకొచ్చారు. శ్రీవారి వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు 3 రోజులు, ఎంబీబీఎస్ డాక్టర్లకు వారం రోజులు టీటీడీ ఆస్పత్రులలో స్వచ్ఛంద సేవ చేసేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తోంది. అలాగే వీరికి తిరుమల, తిరుపతిలో భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, తిరుపతిలోని స్విమ్స్, బర్డ్ ఆసుపత్రులు, ఆయుర్వేద ఆసుపత్రి, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రులలో వీరు తమ సేవలు అందించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వైద్యులు టీటీడీ వెబ్ సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు.