
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Petrol Diesel: పెట్రోల్, డీజిల్ అమ్మకాల పంపిణీపై విధించిన తాత్కాలిక ఆంక్షలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల రిటైల్ అవుట్లెట్లపై విధించిన అన్ని తాత్కాలిక నియంత్రణ చర్యలను 2026 జూలై 1 నుంచి తొలగిస్తున్నట్లు ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమాసియా సంక్షోభ సమయంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ.. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ చిల్లర ధరలను స్థిరంగా ఉంచింది. దీనివల్ల చిల్లర, బల్క్ వినియోగదారులకు ఇంధన ధరలలో గణనీయమైన వ్యత్యాసం ఏర్పడిందని ప్రభుత్వం పేర్కొంది. ఫలితంగా అనేక పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు చిల్లర పెట్రోల్ పంపుల నుండి ఇంధనాన్ని కొనుగోలు చేయవలసి వచ్చింది. ఇది డీజిల్ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్, దారి మళ్లింపు వంటి సమస్యలకు దారితీసింది.
ఈ పరిస్థితిని పరిష్కరించడానికి, ప్రభుత్వం 2026 జూన్ 12న తాత్కాలిక నిబంధనలను అమలు చేసింది. ఈ నిబంధనల ప్రకారం, రిటైల్ పెట్రోల్ పంపుల వద్ద ప్రతి వినియోగదారుడు లేదా వాహనం రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హై-స్పీడ్ డీజిల్ ను మాత్రమే వినియోగించుకోవచ్చు. పారిశ్రామిక, సంస్థాగత వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్లకు బదులుగా, నిర్దేశిత వినియోగదారుల పంపుల నుండి ఇంధనాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. అయితే దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను సమీక్షించిన అనంతరం.. సరఫరా పరిస్థితి ఇప్పుడు సాధారణ స్థితికి తిరిగి వచ్చిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందువల్ల.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ఈ తాత్కాలిక ఆంక్షలను కొనసాగించాల్సిన అవసరం లేదు. కాబట్టి, జూన్ 12, 2026 నాటి ఉత్తర్వును జూలై 1, 2026 నుండి ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.
ఈ తాత్కాలిక చర్యలు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంతగా లభించేలా చూడటానికి, చిల్లర వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను నివారించడానికి సహాయపడతాయని పేర్కొంది. ఇప్పుడు.. సరఫరాలు సాధారణ స్థితికి రావడంతో, ఈ ఆంక్షలను ఎత్తివేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణం స్థితికి చేరుకోవడం ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం రిటైల్ ఔట్ లెట్లలో ఉన్న ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.