
ఇండియాలో వచ్చిన డిజిటల్ విప్లవం ప్రజల ఆర్థిక అలవాట్లను పూర్తిగా మార్చేసింది. గతంలో జేబులో, పర్సులో డబ్బులు లేకుంటే బయటకు వెళ్లేవారు కాదు... కానీ ఇప్పుడు రూపాయి లేకున్నా సరే ఎలాంటి ఇబ్బంది
లేకుండా తిరుగుతున్నారు. ప్రతి దగ్గరా డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు... కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతోంది. ఒక్కరూపాయి నుండి లక్ష రూపాయల వరకు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపిఐ యాప్స్... ఇంతకంటే ఎక్కువ డబ్బులు అవసరం అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారు. దీంతో డబ్బులు వెంటపెట్టుకుని తిరిగే అవసరం లేకుండా పోయింది.
అయితే ఇటీవల కాలంలో ఓ కొత్త ట్రెండ్ ప్రారంభమయ్యింది. దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నా చాలామంది ఇళ్లలో రూ.50, రూ.100, రూ.200 వంటి కరెన్సీ నోట్లను ఎక్కువగా నిల్వ ఉంచుకుంటున్నారని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీంతో చిన్న నోట్లకు బాగా డిమాండ్ ఏర్పడుతోందట. ఇంతకూ డిజిటల్ పేమెంట్స్ జోరుగా సాగుతున్న సమయంలా ఇండియన్స్ మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు చిన్న నోట్లను ఎందుకు దాచుతున్నారు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు ఆర్థిక నిపుణులు చెప్పే కారణాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేస్తున్న దాడులు, అంతకుముందు రష్యా-ఉక్రెయిన్ యుద్దం, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దూకుడు నిర్ణయాలు... ఇలా వరల్డ్ ఎకానమీని ప్రభావితం చేసేలా పరిస్థితులు ఉన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. అందుకే కొంత నగదు దాచుకోవడం మంచిదనే అభిప్రాయం భారతీయుల్లో ఏర్పడింది.. ఏదైనా ఊహించని పరిణామాలు జరిగితే ఉపయోగపడాయని భావిస్తున్నారట.
ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు... ఒక్కసారిగా తారుమారు అవుతాయనే జీవిత పాఠాన్ని కరోనా మహమ్మారి నేర్పింది. అందుకే కరోనా తర్వాత ప్రజల ఆర్థిక అలవాట్లు మారినట్లు నిపుణులు చెబుతున్నారు. ఊహించని పరిస్థితుల్లో బ్యాంకింగ్ సేవలు లేదా ఇంటర్నెట్కు అంతరాయం కలిగితే, చేతిలో ఉన్న నగదు ఉపయోగపడుతుందని చాలామంది భావిస్తున్నారు. అందుకే చిన్న నోట్లు దాచుకుంటున్నారని నిపుణులు అభిప్రాయం.
ఇటీవల స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖర్చులు తగ్గించుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బంగారం ఎక్కువగా కొనొద్దని, పెట్రోల్ పై ఎక్కువ ఖర్చు వద్దని సూచించారు. దీంతో రాబోయే రోజుల్లో ఏదో జరగబోతోందనే భయం ప్రజల్లో మొదలయ్యింది. అందుకే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలనే కొంత డబ్బును క్యాష్ రూపంలో పొదుపు చేస్తున్నారు. యూపిఐ పేమెంట్, డిజిటల్ లావాదేవీలు జరక్కపోయినా దాచుకున్న క్యాష్ తో మేనేజ్ చేయవచ్చన్నది వారి అభిప్రాయం.
రూ.50, రూ.100, రూ.200 నోట్లను ఈజీగా మార్చుకోవచ్చు... అదే రూ.500 నోటును అంత ఈజీగా మార్చలేం. అంటే కూరగాయలు, కిరాణా సామాను లాంటి చిన్న చిన్న కొనుగోళ్లకు రూ.500 నోటు ఇస్తే చిల్లర దొరకడం కష్టమవుతుంది... అదే రూ.50.రూ.100 నోటుతో ఇబ్బంది ఉండదు. ఇది కూడా ప్రజలు చిన్ననోట్లు దాచడం వెనక కారణంగా తెలుస్తోంది.
చిన్ననోట్లతో ఆర్థిక భద్రత అని ప్రజలు భావిస్తున్నారు. రూ.500 లేదా అంతకంటే పెద్ద నోట్లను దాచడం వల్ల ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అదే రూ.100, రూ.200 నోట్లు అయితే సులభంగా సర్దుబాటు చేసుకోవచ్చు. అందుకే ఈ నోట్లను డిమాండ్ పెరిగింది.
అయితే ప్రస్తుతం మార్కెట్లో రూ.100, రూ.200 నోట్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నా అధికారికంగా ఎలాంటి కొరత లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇతర బ్యాంకుల్లో తగినన్ని నోట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత డిమాండ్ కేవలం ప్రజల ముందుజాగ్రత్త చర్యేనని నిపుణులు చెబుతున్నారు. కానీ భవిష్యత్ లో ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందులు తప్పవంటున్నారు. కరెన్సీ అనేది మార్కెట్లో ఉండాలి కానీ ఇళ్లలో కాదు... దీనివల్ల ద్రవ్యోల్బనం పెరిగి టెక్నికల్ ఇబ్బందులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోజువారీ ఖర్చులు, అత్యవసరాల కోసం కొంత నగదు ఇంట్లో ఉంచుకోవడం మంచిదేనని నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఎక్కువ మొత్తంలో డబ్బును ఇంట్లో దాచుకోవడం కంటే బ్యాంకు ఖాతాలు, సురక్షితమైన డిజిటల్ పెట్టుబడి మార్గాల్లో ఉంచడమే ఉత్తమమని సలహా ఇస్తున్నారు.