
ముంబైలో మొహర్రం ఊరేగింపులో పాల్గొన్న వేలాది మంది ప్రాణాలను బలిగొనేందుకు జరిగిన ఒక భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
నొప్పి నివారణ మాత్రలు, రోగనిరోధక శక్తిని పెంచే మాత్రలంటూ విషపూరితమైన క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న ఫయాజ్ ప్రేమ్‌జీ అనే యువకుడిని బైకుల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్యాప్సూల్స్ మింగిన 11 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.ముంబైలోని రే రోడ్ సమీపంలోని రహ్మతాబాద్ శ్మశానవాటిక వద్ద అషురా ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు రద్దీని ఆసరాగా చేసుకుని, ఇమ్యూనిటీ బూస్టర్ల పేరుతో ఈ విషపు గుళికలను పంపిణీ చేశాడు. వీటిని సేవించిన కొద్దిసేపటికే పలువురు తీవ్రమైన వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.ఈ పెను ప్రమాదం నుంచి వేలాది మందిని రక్షించడంలో ముగ్గురు మహిళా స్వచ్ఛంద సేవకులు చురుకైన పాత్ర పోషించారు. నిందితుడు అనుమానాస్పదంగా మాత్రలు పంపిణీ చేయడాన్ని గమనించిన ఈ మహిళలు వెంటనే అతడిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా ఆ క్యాప్సూల్స్ తెరిచి చూడగా అందులో వింత పొడి కనిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వారు లౌడ్‌స్పీకర్‌ ద్వారా ఆ మాత్రలు ఎవరూ మింగవద్దని మైకుల్లో హెచ్చరించడంతో పెద్ద విపత్తు తప్పింది.లక్షల మందిని లక్ష్యంగా చేసుకుని కుట్రనిందితుడు పంపిణీ చేసిన క్యాప్సూల్స్‌లో జింక్ ఫాస్ఫైడ్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం ఉన్నట్లు పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. సాధారణంగా ఎలుకల మందు, క్రిమినాశక మందుల్లో ఈ రసాయనాన్ని వాడుతుంటారు. ఈ ప్రమాదకరమైన రసాయనంతో కూడిన మాత్రలను పంపిణీ చేయడం ద్వారా సుమారు 15 వేల మందిని నరమేధం చేయడమే తన లక్ష్యమని నిందితుడు విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి సుమారు 14,900 విషపు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.అయితే ఈ భారీ ఘాతుకానికి వెనుక చాలా కాలంగా ప్రణాళికలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఫయాజ్ ప్రేమ్‌జీ ఏకంగా 30 వేల ఖాళీ రసాయన క్యాప్సూల్స్, అలాగే సుమారు 50 కిలోల ప్రమాదకరమైన ఫాస్ఫరస్ కెమికల్‌ను ముందే ఆర్డర్ చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసే సమయానికే గణనీయమైన సంఖ్యలో మాత్రలను అతను పంపిణీ చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆ మాత్రలు తీసుకున్న వారిని త్వరగా గుర్తించే ప్రక్రియను ముంబై పోలీసులు ముమ్మరం చేశారు.మరోవైపు ఈ కుట్ర వెనుక విదేశీ శక్తుల జోక్యం ఉందనే అనుమానాలు మొదలయ్యాయి. నిందితుడి పూర్తి వివరాలను పరిశీలించిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. నిందితుడు గతంలో ఇరాన్, ఇరాక్ దేశాలను సందర్శించాడని పోలీసులు కనుగొన్నారు. ఈ క్రమంలో ఈ విపత్కర చర్యకు పాల్పడేందుకు అతనికి విదేశాల నుంచి ఏదైనా మద్దతు లభించిందా లేదా ఏదైనా ఉగ్రవాద ముఠాలు అతడిని ప్రభావితం చేశాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.అదృష్టవశాత్తూ సమయానికి లౌడ్‌స్పీకర్ల ద్వారా చేసిన ప్రకటనలు, మహిళా వాలంటీర్లు చూపిన ధైర్యం వేలాది మంది అమాయకుల ప్రాణాలను కాపాడాయి. ఈ కేసులో మరింత సమగ్ర సమాచారం సేకరించేందుకు నిందితుడి సాంకేతిక పరికరాలు, ఆర్థిక లావాదేవీలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.