
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ‘కరుప్పు’ సినిమా భారీ విజయంతో ఫుల్ జోష్లో ఉన్నారు హీరో సూర్య. అదే ఉత్సాహంతో తన కొత్త సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ సినిమాలో సూర్య అభిమానులకు ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారు. 2014లో వచ్చిన ‘అంజన్’ మూవీలో ‘ఏక్ దో తీన్’ పాట పాడిన సూర్య.. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా కోసం గొంతు సవరించుకున్నారు. ఇందులో సూర్య స్వయంగా ఓ పాట పాడారు. ఇదొక పూర్తి స్థాయి హుషారైన డ్యాన్స్ నంబర్ అని తెలుస్తోంది. ఈ పాటకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఇవ్వగా.. కెన్ కరుణాస్ లిరిక్స్ అందించారు. ఈ విషయాన్ని జీవీ ప్రకాష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సూర్య పాడిన ఈ పాట సినిమాకే హైలైట్గా నిలవనుంది. ఇటీవల ఈ సినిమాలోని ‘నేనో బటర్ఫ్లై’ పాటకు మంచి స్పందన వచ్చింది.
ఇక ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధిక శరత్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.