
Vaibhav Sooryavanshi : పసికూన ఐర్లాండ్ క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది. వరల్డ్ నెంబర్ 1 టీ20 జట్టు టీమిండియాను వరుసగా రెండు మ్యాచ్లలో ఓడించి సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది.
దీంతో భారత జట్టు పరువు పోగొట్టుకుంది. ముఖ్యంగా బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలం కావడంపై చర్చ జరుగుతుంది.
రెండో టీ20లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరూ డకౌట్ కావడం భారత బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఐపీఎల్, అండర్ -19, దేశీయ క్రికెట్లో పరుగుల వదర పారించి సూపర్ ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవటం.. అతన్ని బెంచ్కే పరిమితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత సహాయ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ దీనిపై స్పందిస్తూ వివరణ ఇచ్చారు.
యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో అరంగేట్రం దక్కకపోవడం భారత అభిమానుల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ అంశంపై ర్యాన్ టెన్ డోషెట్ మాట్లాడుతూ.. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే స్థాయికి సిద్ధంగా ఉన్నాడని, అతని ప్రతిభపై ఎలాంటి సందేహం లేదని కోచ్ తెలిపారు. అయితే, ఇప్పటికే జట్టులో మంచి ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లను కేవలం వైభవ్కు అవకాశం ఇవ్వడంకోసం తప్పించడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు. జట్టు సమతుల్యత, దీర్ఘకాళిక ప్రణాళికను దృష్టింలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఇదిలాఉంటే.. భారత్ జట్టు వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లోనైనా వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం వస్తుందా..? లేదంటే మరోసారి బెంచ్ కే పరిమితం చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.