
Ben Stokes : ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్, ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు.
England Cricketer Ben Stokes to retire from international cricket
Ben Stokes : ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్, ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. మూడో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట మధ్యలో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ మ్యాచ్ ముగిసిన తరువాత తన అంతర్జాతీయ కెరీర్కు పూర్తిగా ముగింపు పలకనున్నట్లు 35ఏళ్ల బెన్ స్టోక్స్ స్పష్టం చేశారు. ఇక కెప్టెన్ గా మరో రెండు రోజులే ఉంటా. ఇంగ్లాండ్ కు ప్రాతినిధ్యం వహించేది కూడా ఇంకో రెండు రోజులే అని స్టోక్స్ నాలుగు రోజు ఆట ఆరంభానికి ముందు డ్రెస్సింగ్ రూమ్ లో తన సహచరులతో తెలిపాడు. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో స్టోక్స్ భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. నా రిటైర్మెంట్కు గల కారణాల గురించి తర్వాత అయినా చెప్పొచ్చు.. ప్రస్తుతం ఈ జట్టుకోసం నేను మరోసారి కష్టపడాల్సి ఉంది. ఫలితం ఎలా ఉన్నా శక్తివంచన లేకుండా పనిచేశామన్న సంతృప్తితో మైదానం వీడాలి. అదే నా కోరిక అని స్టోక్స్ సహచర ఆటగాళ్లతో వ్యాఖానించాడు.
2010లో అరంగేట్రం చేసిన బెన్ స్టోక్స్.. 122 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 7273, వన్డేల్లో 3463, టీ20ల్లో 585 పరుగులు చేశాడు. టెస్టుల్లో 252 వికెట్లు, వన్డేల్లో 74, టీ20ల్లో 26 వికెట్లు తీశాడు. టీ20, వన్డే కెరీర్కు స్టోక్స్ ఇంతకుముందే వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 2019 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్కు తొలి వన్డే ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే 2022లో టెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి, కోచ్ బ్ర్రెండన్ మెకల్లమ్తో కలిసి దూకుడైన “బాజ్బాల్” శైలిని జట్టులో ప్రవేశపెట్టి ఇంగ్లండ్ టెస్టు క్రికెట్కు కొత్త దిశ చూపించారు.
స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటనతో ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. సహచర ఆటగాళ్లు, అభిమానులు నిలబడి చప్పట్లతో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇంగ్లండ్ క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరిగా స్టోక్స్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీలు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.