
సాంకేతికతకు సంస్కారం తోడైతేనే ప్రగతి సాధ్యమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఇష్టపడిన పనిని కష్టపడి పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
వీవీఐటీయూలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
పెదకాకాని, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): సాంకేతికతకు సంస్కారం తోడైతేనే ప్రగతి సాధ్యమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఇష్టపడిన పనిని కష్టపడి పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు. శనివారం గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ (వీవీఐటీ)లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలతో పాటు 1345 మంది పట్టభద్రులకు డిగ్రీలను ప్రదానం చేశారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, తమను ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రులను, గురువులను విద్యార్థులు మరువకూడదని సూచించారు. తన అనుభవంలో తెలుసుకున్న విషయాలను ఇతరులకు తెలిపే ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, సాంకేతికతను మంచి మార్గంలో వినియోగించాలంటే నైతిక విలువలు ముఖ్యమని తెలిపారు. వీవీఐటీ యూనివర్సిటీ ప్రో చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ, ఇతరులకు మంచి చేయడం ద్వారా ఉన్నత స్థితికి చేరుకోవచ్చని చెప్పారు. తమ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ప్రపంచంలోనికి అడుగుపెడుతున్నారని, అక్కడ ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.