
ముంబై పోలీసులు తాజాగా భారీ కుట్రను భగ్నం చేశారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా ప్రజలకు ఎలుకల మందు నింపిన విషపు గుళికలు పంపిణీ చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబై పోలీసులు తాజాగా భారీ కుట్రను భగ్నం చేశారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా ప్రజలకు ఎలుకల మందు నింపిన విషపు గుళికలు పంపిణీ చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 14,900 విషపు గుళికలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఫయాజ్ ప్రేమ్జీగా గుర్తించారు. అతడు పుణెలోని విమాన్ నగర్ ప్రాంతంలో ఉంటున్నాడని చెప్పారు. పెయింట్ షాపు నిర్వహిస్తాడని తెలిపారు.
నిందితుడు కొన్ని రోజులుగా ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలోని ఒక డార్మిటరీలో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. జేజే, బైకుల్లా ప్రాంతాల మీదుగా మొహర్రం ఊరేగింపు వెళుతున్న సమయంలో నిందితుడు అక్కడున్న వారికి విషపు గుళికలను పంచే ప్రయత్నం చేసే సమయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మొత్తం 30 వేల గుళికలను రెడీ చేసేందుకు ఫయాజ్ ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. 2019-25 మధ్య కాలంలో అతడు పలుమార్లు ఇరాన్, ఇరాక్లను సందర్శించినట్టు కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. గతేడాదే అతడు ఏకంగా 19 సార్లు ఇరాన్, ఇరాక్లకు వెళ్లివచ్చాడు. ఈ పర్యటనల వెనక అతడి ఉద్దేశం ఏమిటో, దీని వెనుక మరేదైనా పెద్ద నెట్వర్క్ ఉండవచ్చనే అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఫయాజ్ సోదరి ప్రస్తుతం ఇరాన్లో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తోంది. అతడి తల్లి కూడా ఇరాన్లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఫయాజ్ డైవర్సీ అని కూడా చెప్పారు. అతడి మొబైల్ ఫోన్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలపై వారు దృష్టిసారించారు.
ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు.. మరో చార్జ్ షీటు దాఖలు చేసిన ఎన్ఐఏ
ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటన.. విక్టోరియాలో ఘన స్వాగతం..