
– రూ.6.5 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలు, విత్తనాల పంపిణీ రుద్రంపూర్, జూన్ 27 : కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో భారతీయ మొక్కజొన్న పరిశోధనా సంస్థ ఆర్థిక సహకారం, మొక్కజొన్న...
– రూ.6.5 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలు, విత్తనాల పంపిణీ
రుద్రంపూర్, జూన్ 27 : కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో భారతీయ మొక్కజొన్న పరిశోధనా సంస్థ ఆర్థిక సహకారం, మొక్కజొన్న పరిశోధనా విభాగం, రాజేంద్రనగర్ సాంకేతిక సహకారంతో శనివారం “మొక్కజొన్న సాగు – మెలుకువలు” అవగాహన కార్యక్రమంతో పాటు గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా రూ.6.5 లక్షల విలువైన మొక్కజొన్న విత్తనాలు, నాటు యంత్రాలు, టార్పాలిన్ పట్టాలు, కలుపు మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మొక్కజొన్న పరిశోధనా విభాగం హెడ్ డా.సుశీల మాట్లాడుతూ.. సాంప్రదాయ పద్ధతులకు బదులుగా యంత్రాల ద్వారా మొక్కజొన్న విత్తనాలు నాటడం వల్ల కూలీల ఖర్చు తగ్గి, రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
ప్రధాన శాస్త్రవేత్త డా.భద్రు మాట్లాడుతూ.. రైతులు మొక్కజొన్న రకాల ఎంపికలో జాగ్రత్త వహించి, మార్కెట్లో గుర్తింపు పొందిన సంస్థలు విడుదల చేసిన విత్తన రకాలనే సాగు చేయాలని సూచించారు. శాస్త్రవేత్త డా. అనూష మొక్కజొన్నలో వచ్చే చీడపీడలు, తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. మధ్య తెలంగాణ మండల పరిశోధనా సహాయ సంచాలకులు డా.ఎం.శ్రీధర్ మాట్లాడుతూ.. కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవడంతో పాటు వ్యవసాయ యాంత్రీకరణను విస్తృతంగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు.
డిప్యూటీ మేయర్ సిరివారపు లలిత కుమారి మాట్లాడుతూ.. మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం స్వాగతించదగ్గ నిర్ణయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డా.భరత్, ఉద్యాన శాస్త్రవేత్త బి.శివతో పాటు సుమారు 150 మంది రైతులు పాల్గొన్నారు. అనంతరం గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా గుండాల, అల్లపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, లక్ష్మీదేవిపల్లి, జూలూరుపాడు, సుజాతానగర్, పాల్వంచ, అశ్వాపురం, మణుగూరు మండలాలకు చెందిన 150 మంది రైతులకు మొక్కజొన్న విత్తనాలు, విత్తన నాటు యంత్రాలు, టార్పాలిన్ పట్టాలు, కలుపు మందులను పంపిణీ చేశారు.