
ICC Full Members undefeated against Ireland: టీ20 ప్రపంచకప్ 2026 చారిత్రాత్మక విజయం తర్వాత భారత క్రికెట్ అభిమానులకు కోలుకోలేని షాక్ తగిలింది.
ఐర్లాండ్ పర్యటనలో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా తొలి టీ20లోనే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైన ఎనిమిదో ఐసీసీ పూర్తిస్థాయి సభ్యదేశంగా భారత్ నిలిచింది. అయితే ప్రపంచ క్రికెట్లో ఐర్లాండ్ జేత్రయాత్రకు లొంగని మూడు బలమైన జట్లు ఇంకా ఉన్నాయి.
ప్రపంచ క్రికెట్ను దశాబ్దాలుగా ఏలుతున్న ఆస్ట్రేలియా జట్టును వన్డే, టీ20 ఫార్మాట్లలో లొంగదీసుకోవడం ఐర్లాండ్కు ఇప్పటివరకు సాధ్యం కాలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన ఏడు మ్యాచ్ల్లోనూ ఆసీస్ ఘన విజయం సాధించింది. ఒక మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దయింది. దాదాపు అన్ని మ్యాచ్ల్లోనూ కంగారూలు ఏకపక్ష విజయాలు నమోదు చేసినప్పటికీ, 2015 ఆగస్టులో జరిగిన వన్డే మ్యాచ్ మాత్రం క్రికెట్ ప్రేమికులకు గుర్తిండిపోతుంది.
ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 222 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 84 పరుగులతో రాణించాడు. అనంతరం ఛేదనలో ఐర్లాండ్ బ్యాటర్లు ఎడ్ జాయిస్, నియాల్ ఓబ్రెయిన్ అద్భుత పోరాటంతో ఆసీస్ను భయపెట్టారు. అయితే నాథన్ కౌల్టర్-నైల్ మూడు వికెట్లతో విరుచుకుపడగా, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ప్రత్యర్థిని కట్టడి చేశారు. చివరికి డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో విజయం సాధించి తన అజేయ రికార్డును కాపాడుకుంది.
ఐర్లాండ్పై ఆస్ట్రేలియా కంటే లంక జట్టు మరింత మెరుగైన రికార్డును కలిగి ఉంది. విభిన్న ఫార్మాట్లలో ఇప్పటివరకు జరిగిన 11 మ్యాచ్ల్లోనూ శ్రీలంకనే విజయం వరించింది. అయితే 2009 లార్డ్స్ మైదానంలో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో ఐర్లాండ్ గట్టి పోటీ ఇచ్చింది. మహేల జయవర్ధనే 78 పరుగులతో రాణించడంతో శ్రీలంక 144 పరుగులు చేసింది.
ఐర్లాండ్ బౌలర్ అలెక్స్ కుసాక్ నాలుగు వికెట్లతో లంక బ్యాటింగ్ లైన్అప్ను దెబ్బతీశాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్కు ఓపెనర్లు మంచి పునాది వేశారు. జాన్ మూనీ ఆఖరి వరకు క్రీజులో ఉన్నా లోయర్ మిడిల్ ఆర్డర్ విఫలమవడంతో ఐర్లాండ్ గెలవలేకపోయింది. లసిత్ మలింగ, అజంతా మెండిస్, ముత్తయ్య మురళీధరన్ లతో కూడిన లంక స్పిన్, పేస్ త్రయం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక 9 పరుగుల తేడాతో గట్టెక్కింది.
కివీస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఐరిష్ పోరాటం..
న్యూజిలాండ్ జట్టు ఐర్లాండ్పై ఆడిన 13 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచింది. కానీ ప్రతి మ్యాచ్లోనూ కివీస్ జట్టుకు ఐర్లాండ్ చుక్కలు చూపించింది. ఒక వికెట్ తేడాతో, మూడు వికెట్ల తేడాతో, కేవలం ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి.
ముఖ్యంగా 2022 జూలై 15న డబ్లిన్లో జరిగిన వన్డే మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్లలో ఒకటిగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. మార్టిన్ గప్టిల్ (115), హెన్రీ నికోల్స్ (79) సెంచరీ, హాఫ్ సెంచరీలతో 360 పరుగుల భారీ స్కోరు సాధించింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఐరిష్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (120), హ్యారీ టెక్టర్ (108) అద్భుత శతకాలతో న్యూజిలాండ్ బౌలర్లపై దండయాత్ర చేశారు.
మాట్ హెన్రీ నాలుగు వికెట్లు తీసినా ఐర్లాండ్ పోరాటాన్ని ఆపలేకపోయాడు. చివరి ఓవర్లో ఐర్లాండ్ విజయానికి 10 పరుగులు కావాలి. బ్లెయిర్ టిక్నర్ విసిరిన ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా ఐర్లాండ్ వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది.
మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..