
ఇంటర్నెట్డెస్క్: ఒక సినిమా విడుదలైన తర్వాత అందులోని పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలపై చర్చ.. వివాదాలకు దారి తీయడం ఇప్పటివరకూ చూశాం.
ఇటీవల కాలంలో టైటిల్తోనే చర్చకు దారితీసిన మూవీ ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham). సోషల్ మీడియాలో పనిగట్టుకుని కొందరు పెట్టిన పోస్టులు వివాదానికి దారితీశాయి. సినిమా భాష, యాస, టైటిల్స్ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలకు దిగారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత బన్ని వాస్ స్పందించారు. ఇది ఒక ప్రాంతానికి పరిమితమయ్యే కథ కాదని, కథను (iduppu kayitham movie ) బట్టే టైటిల్ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వివాదం నేపథ్యంలో టైటిల్, కథను మార్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
‘‘ఏ సినిమాకైనా కథ, దాని నేపథ్యం బట్టే టైటిల్ ఉంటుంది. దీనిపై ఇక చర్చ అనవసరం. షూటింగ్ పూర్తయి విడుదలైన తర్వాత సినిమానే మాట్లాడుతుంది. ఆంధ్రా, తెలంగాణ ఎవరైనా సరే సినిమా నచ్చితేనే చూస్తారు. నచ్చకపోతే చూడరు. నేను చేయాల్సింది సినిమాను బాగా తీయడంపై దృష్టి పెట్టడమే. ప్రస్తుతం ఈ వివాదం వల్ల సినిమాకు కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. రేపు సినిమా బాగుంటే అన్నీ సర్దుకుంటాయి. ఇది ఒక ప్రాంతానికి పరిమితమయ్యే కథ కాదు. నాకు పూర్తి నమ్మకం ఉంది. దర్శకుడు వచ్చిన ప్రాంతం, చూసిన వాస్తవ సంఘటనల నుంచి రాసుకున్న కథ ఇది’’
‘‘ప్రాంతాన్ని బట్టి కథ ఉంటుందా?అంటే ఎక్కడో తీసిన హాలీవుడ్ మూవీ ఇక్కడ ఆడదు కదా! ఇది ప్రతి ఇంటిలో ఉండే కథ. క్లైమాక్స్కు వచ్చే సరికి అత్తాకోడళ్లు, మామాఅల్లుళ్లు ఒకరి చేయి ఒకరు పట్టుకుని బయటకు వస్తారు. సోషల్మీడియాలో పోస్టులు పెట్టే ముందు ఆలోచించాలి. విభేదాలు తీసుకురాకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నటీనటులకు డైలీ రెమ్యునరేషన్స్ ఇచ్చి సినిమా చేయాలంటే కష్టం. అందుకే మేము కొత్త వాళ్లను ప్రోత్సహిస్తున్నాం. నా బడ్జెట్కి, నా పరిధిలోకి వచ్చే వారితోనే సినిమాలు చేస్తా’’అని అన్నారు. ప్రియదర్శి, నాగదుర్గ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు.
ఇడుపు కాయితం అంటే విడాకుల పత్రం.. భార్యాభర్తలు విడిపోవడానికి పెద్దల సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పంద పత్రం. ఇప్పుడు దంపతులు విడిపోవాలనుకుంటే కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. కానీ, కొద్ది కాలం కిందట కలిసి బతకలేమని నిర్ణయించుకున్న దంపతులు పెద్ద మనుషుల సమక్షంలో విడిపోవడానికి ఒక ఒప్పందం చేసుకునే వారు. దీన్నే ఇడుపు కాయితం అని పిలిచేవారు. ఇప్పటికీ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇడుపు కాయితం రాసుకొని విడిపోతున్న జంటలున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.