
కొత్తగూడెం, జూన్ 27 : గోదావరి నది వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల...
కొత్తగూడెం, జూన్ 27 : గోదావరి నది వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి గోదావరి వరదల సన్నద్ధతపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వరదల అనంతరం అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుధ్య చర్యలను ముమ్మరం చేయాలని, వైద్యశాఖ అధికారులు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. భద్రాచలం పట్టణంలో గోదావరి నీరు చేరకుండా, వర్షపు నీరు వేగంగా నదిలోకి వెళ్లేలా పంపింగ్ మోటార్లను సిద్ధంగా ఉంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. తాగునీరు, వైద్యం వంటి అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతో పాటు వ్యవసాయ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించాలని అన్నారు. గిరిజన రైతులు ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని, ఎరువులు, ముఖ్యంగా యూరియా వినియోగంపై శాస్త్రీయ అవగాహన కల్పించాలని సూచించారు.భద్రాచలం–కూనవరం రహదారిపై చేపడుతున్న కరకట్ట నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. మూడు సంవత్సరాలుగా పనులు పూర్తికాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సారపాక జాతీయ రహదారిపై ఐటీసీ ఈస్ట్ గేట్ సమీపంలో గోదావరి వరదల సమయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ ప్రాంతంలో జాతీయ రహదారి ఎత్తును పెంచేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి చర్యలు చేపట్టాలని జాతీయ రహదారుల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పిఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శేష్ట, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు పాల్గొన్నారు.