
Pakistan earthquake: వెనిజులాను జంట భూకంపాలు వణికించాయి. ఆ దేశం మొత్తాన్నీ కకావికలం చేశాయి. తీరంలో సంభవించిన ఈ అతి తీవ్ర భూకంపాల బారిన పడి మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 446కు చేరింది.
ఈ సంఖ్య ఇక్కడితో ఆగకపోవచ్చు. భవనాల శిథిలాలను వెలికి తీస్తోన్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. వేలాదిమంది గాయపడ్డారు. అక్కడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.ఈ పరిస్థితుల మధ్య తాజాగా పాకిస్తాన్‌ను శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఈ ఉదయం సరిగ్గా 8:36 నిమిషాల ప్రాంతంలో భూమి ప్రకోపించింది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికుల్లో ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. దీనివల్ల ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు వార్తలు అందలేదు. కొన్ని చోట్ల మాత్రం భవనాలు బీటలు వారాయి.రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.4గా రికార్డయింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ పరిధిలోని బర్ఖాన్ కు నైరుతి దిశగా 72 కిలోమీటర్ల దూరంలో 30.271 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 69.733 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఉపరితలం నుంచి 63 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న తీవ్ర కదలికల వల్ల ఈ ప్రకంపనలు సంభవించినట్లు వివరించింది.ఈ ప్రకంపనల తీవ్రత సాకీ బార్వార్, డేరా ఘాజీ ఖాన్, నహర్ కోట్, విటాక్రీ, అలీఫ్ మిర్జాన్ జాయ్, నానా సాహిబ్ జియారత్, బధాని వంటి ప్రాంతాల్లో కనిపించింది. ప్రకంపనలు సంభవించిన వెంటనే స్థానికులు ఇళ్లల్లో నుంచి బయటికి పరుగెత్తారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలిక పాటి ప్రకంపనలు సంభవిస్తోండటంతో ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. చాలా సమయం పాటు ఆరుబయటే గడపాల్సొచ్చింది వారికి. ఈ ఘటనపై స్థానిక అధికారులు ఆరా తీస్తోన్నారు.భౌగోళికంగా.. క్రియాశీలక భూకంప ప్రాంతం పాకిస్తాన్. యురేషియన్- ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల పరిధిలోకి వస్తుందీ దేశం. దీని పరిధిలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తు‌న్‌ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, కొన్ని గిరిజన ప్రాంతాలు.. యురేషియన్ ప్లేట్ దక్షిణ అంచున ఉన్నాయి. సింధ్, పంజాబ్ ప్రావిన్స్‌తో పాటు మనదేశంలోని జమ్మూ కాశ్మీర్.. ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్స్ పరిధిలో ఉంటాయి. ఫలితంగా ఈ రీజియన్‌లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి.