
శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి ప్రతికారంగా, అమెరికా సైన్యం ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై ఈ తెల్లవారుజామున క్షిపణి, వైమానిక దాడులతో విరుచుకుపడింది.
ఇరాన్ చర్యల్ని తీవ్రంగా తప్పుబట్టిన జేడీ వాన్స్.. హింసకు హింసే సమాధానమని చెప్పారు.
ఆంధ్రజ్యోతి, జూన్ 27: పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న తాత్కాలిక ప్రశాంతతకు మళ్లీ గండి పడింది. జూన్ 17న కుదిరిన చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి ప్రతికారంగా, అమెరికా సైన్యం ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై ఈ తెల్లవారుజామున క్షిపణి, వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడులకు సంబంధించిన 37 సెకన్ల వీడియో ఫుటేజీని తాజాగా అమెరికా మిలిటరీ విడుదల చేసింది.
హింసకు హింసే సమాధానం.. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వార్నింగ్
ఈ పరిణామంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సామాజిక మాధ్యమం 'X' లో ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. 'ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసింది. మేము దానిని గౌరవించాం. ఈ ఒప్పందం (MOU) అమలుపై వారికి ఏవైనా విభేదాలు ఉంటే, వారు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. కానీ హింసకు దిగితే మాత్రం హింసతోనే సమాధానం ఎదుర్కొంటారు'. అని మండిపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫామ్ ద్వారా ఇరాన్ చర్యను 'మూర్ఖత్వంతో కూడిన కాల్పుల విరమణ ఉల్లంఘన' గా అభివర్ణించారు. చాలా ఖరీదైన వాణిజ్య నౌకపై ఇరాన్ ఒక డ్రోన్తో దాడి చేయగా, మిగిలిన మూడు డ్రోన్లను అమెరికా దళాలు విజయవంతంగా కూల్చివేశాయన్నారు.
అమెరికా దాడులు జరిగిన కొద్దిసేపటికే, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) గల్ఫ్ రీజియన్లోని అమెరికా స్థావరాలపై తాము కూడా దాడులు చేసినట్లు ప్రకటించారు. ఒకవేళ అమెరికా మళ్లీ దురాక్రమణకు పాల్పడితే, తమ తదుపరి ప్రతిస్పందన మరింత తీవ్రంగా, విస్తృతంగా ఉంటుందని టెలిగ్రామ్ వేదికగా హెచ్చరించారు.