
పెళ్లిళ్ల పేరుతో వరుస మోసాలకు పాల్పడుతూ పలువురు పురుషులను వంచించిన ఓ యువతిని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దొండపూడికి చెంది
న వజ్రపు మణి అలియాస్ శ్వేతా రెడ్డి అలియాస్ కీర్తి (27) ఈ కేసులో ప్రధాన నిందితురాలు. ఈమె ఇప్పటివరకు ఐదుగురిని వివాహం చేసుకుని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.విజయవాడకు చెందిన సుమప్రియ, అశోక్, శశికళ, రామకృష్ణ అనే మధ్యవర్తులతో కలిసి ఈమె ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పెళ్లి సమయంలో కట్నం లేదా ఇతర ప్రలోభాలతో కూడిన హామీలు ఇచ్చి, వివాహానంతరం కొద్ది రోజులు భర్తతో కలిసి ఉండి, ఆపై కనిపించకుండా పోవడం ఈమె పంథా అని పోలీసులు తెలిపారు.పెద్దవడుగూరు మండలం కాసేంపల్లికి చెందిన యాపర్ల సుధీర్ రెడ్డి అనే వ్యక్తిని 2025లో ఈమె వివాహం చేసుకుంది. పెళ్లైన కొద్ది రోజులకే ఆమె ఎవరికీ చెప్పకుండా అదృశ్యం కావడంతో, బాధితుడు పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇటీవల కర్ణాటకలోని మల్లికుప్పంకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న నిందితురాలు, పెళ్లైన ఆరు రోజులకే మదనపల్లె వైపు ప్రయాణిస్తుండగా పోలీసులకు చిక్కింది. మదనపల్లె మండలం చీకలబైలు సమీపంలో పెద్దవడుగూరు ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఒకరితో వివాహం జరిగిన విషయం మరొకరికి తెలియకుండా ఇలా ఐదుగురిని ఆమె పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.