
Pune Fort Murder | ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె బిజినెస్మ్యాన్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామాం చోటుచేసుకుంది.
ఈ కేసు (Ketan Agarwal Murder Case)లో ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ (Ujjwal Nikam)ను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం (CMO) ఎక్స్ వేదికగా వెల్లడించింది.
పుణెలోని చారిత్రక లోహ్గఢ్ కోట వద్ద కేతన్ను లోయలోకి తోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడి కాబోయే భార్య సియా గోయల్ (Siya Goyal), ఆమె ప్రియుడు చేతన్ నిందితులుగా ఉన్నారు. తన కుమారుడి మరణంపై తమకు న్యాయం చేయాలని కోరుతూ కేతన్ కుటుంబసభ్యులు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis)ను కలిశారు. ఈ కేసులో ఫాస్ట్ట్రాక్ విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష విధించాలని వారు కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు.
‘‘ఇది చాలా దిగ్భ్రాంతికర ఘటన. కేతన్ (Ketan Agarwal) కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమిస్తున్నాం. ఈ కేసును వాదించేందుకు నికమ్ కూడా సమ్మతించారు. విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని న్యాయశాఖను ఆదేశించాం. ఈ కేసులో ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టబోం. బాధితులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం’’ అని సీఎం దేవేంద్ర ఫడణవీస్ హామీ ఇచ్చారు.
దేశంలోని ప్రముఖ న్యాయవాదులలో ఉజ్వల్ నికమ్ ఒకరు. 26/11 ముంబయి ఉగ్రదాడుల కేసు విచారణ, ఇతర సంచలనాత్మక క్రిమినల్ కేసుల్లో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తరఫున ఉత్తర-మధ్య ముంబయి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గుడీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సందడి చేసింది.