Major Shiva Kiran Obituary : హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చడంలో, నగర పౌర వసతుల మెరుగుదలకు నిరంతరం శ్రమించిన విశ్రాంత ఆర్మీ అధికారి, ప్రముఖ పర్యావరణవేత్త మేజర్ శివకిరణ్ 61 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొండాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 10.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పర్యావరణ ప్రేమికులు, నగర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.అనారోగ్యంతో పోరాడుతూ..పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మేజర్ శివకిరణ్ క్లోమానికి సంబంధించిన నొప్పితో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి ఆయనకు క్లోమ గ్రంథి కణితి ఆపరేషన్ జరిగింది. ఒకే సమస్యపై వరుసగా రెండు సార్లు శస్త్రచికిత్సలు జరగడంతో ఆయన శరీరం తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే గురువారం రాత్రి ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. వైద్యులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బేగంపేటలోని కుందన్బాగ్ నివాసి అయిన మేజర్ శివకిరణ్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.'సుకుకి ఎక్స్ నోరా' ప్రస్థానందేశ రక్షణలో ఆర్మీ అధికారిగా సేవలు అందించిన శివకిరణ్.. రిటైర్మెంట్ తర్వాత హైదరాబాద్ నగర పర్యావరణ పరిరక్షణను తన జీవిత ఆశయంగా మార్చుకున్నారు. గత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎమ్సీహెచ్) కాలంలోనే నగరంలో పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయంగా తొలగించేందుకు ఆయన 'సుకుకి ఎక్స్ నోరా' అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు. కేవలం చెత్తను ఎత్తడమే కాకుండా, సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్న చెత్త ఏరుకునే వారి సంక్షేమం కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. నగరవ్యాప్తంగా దాదాపు 50 వికేంద్రీకృత జీరో వేస్ట్ ప్రాజెక్టులను విజయవంతంగా నెలకొల్పారు.జీహెచ్ఎంసీ వ్యాప్తంగా స్వచ్ఛ ఆటో నెట్వర్క్..గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎమ్సీ) పరిధిలో నేడు మనం చూస్తున్న 'స్వచ్ఛ ఆటో ట్రాలీ'ల వ్యవస్థ వెనుక మేజర్ శివకిరణ్ ఆలోచన, కృషి ఎంతో ఉన్నాయి. నగరవ్యాప్తంగా ఇండ్ల నుంచి చెత్తను సేకరించేందుకు ఏకంగా 4,500 ఆటోలతో కూడిన భారీ స్వచ్ఛ నెట్వర్క్ను ఆయన రూపకల్పన చేసి విజయవంతం చేశారు. పర్యావరణ రంగంతో పాటు భౌగోళిక సమాచార విస్తరణ కోసం ఆయన 'జియో మ్యాప్ సొసైటీ'ని కూడా స్థాపించి సేవలు అందించారు.నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలుమేజర్ శివకిరణ్ భౌతికకాయానికి పౌర సమాజం, అభిమానులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల నిర్ణయం ప్రకారం.. ఆయన అంతిమ సంస్కారాలు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో జరగనున్నాయి. ఒక గ్రీన్ వారియర్గా, ఆర్మీ అధికారిగా ఆయన హైదరాబాద్ నగరానికి అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమే.