
ఊహించని విపత్తు విరుచుకు పడింది. వరుస భూకంపాలు... వెనెజువెలాను నిలువెల్లా వణికించాయి. ఈ విపత్తు ధాటికి ఆదేశం అతలాకుతలమైంది. ప్రాణనష్టం కూడా భారీగానే ఉంది.
ముఖ్యంగా తీర నగరమైన ‘లా గువైరా’ అయితే ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. అక్కడ ఎటు చూసినా ధ్వంసమైన భవనాల వరుసలే కన్పిస్తున్నాయి. ఇక, ఈ నగరంలోని ప్రముఖ హోటల్ ఒకటి శిథిలాల దిబ్బలా మారింది. లా గువైరాలోని మకుటో ప్రాంతంలోని ‘హోటల్ ఎడ్వర్డ్’ ఎంతో ఫేమస్. ఎయిర్పోర్టుకు సమీపంలో ఉండే ఈ 10 అంతస్తుల భవనం.. బీచ్వ్యూతో ఆహ్లాదకరంగా ఉండేది. ఇక్కడ పార్టీలు, సమావేశాలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా సంభవించిన భూకంపం ధాటికి ఈ భవనం పేకమేడలా కూలిపోయింది. కేవలం హోటల్ బేస్మెంట్ మాత్రమే మిగిలి గుర్తుపట్టలేని విధంగా ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే, భూకంపం సమయంలో ఈ హోటల్లో ఎంతమంది ఉన్నారు.. వారి పరిస్థితి ఏంటన్నది తెలియరాలేదు. వెనెజువెలా బేస్బాస్ స్టార్ ఆటగాళ్లకు చెందిన కుటుంబసభ్యులు ఈ హోటల్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. డిజాస్టర్ జోన్గా.. కేవలం క్షణాల వ్యవధిలో సంభవించిన భారీ భూకంపాల ప్రభావంతో వెనెజువెలా రాజధాని కరాకస్తో పాటు పలు నగరాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇందులో అత్యధికంగా ప్రభావితమైంది ‘లా గువైరా’నే అని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వెల్లడించారు. దీన్ని ‘డిజాస్టర్ జోన్’గా ప్రకటించారు. ఇక్కడ పరిస్థితి అత్యంత విషాదకరం అని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 30 సార్లు భూప్రకంపనలు సంభవించాయి. మరోవైపు, ఈ విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 160 దాటింది.. 971 మంది గాయపడినట్లు రోడ్రిగ్జ్ వెల్లడించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక, విపత్తు వేళ వెనెజువెలాకు సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి. జర్మనీ సైనిక రవాణా విమానాలను పంపిస్తామని చెప్పింది. ఎమర్జెన్సీ సాయం చేస్తామని స్పెయిన్ తెలిపింది.