
కేంద్రం తాజాగా పాస్పోర్టు ఫీజులను పెంచింది. జులై 1న నుంచి సవరించిన ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఇంటర్నెట్ డెస్క్: కేంద్రం తాజాగా పాస్పోర్టు ఫీజులను పెంచింది.
కొత్త ఫీజులు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్రం ప్రకటన ప్రకారం, 18 ఏళ్లు పైబడిన వారు కొత్త పాస్పోర్టు (36 పేజీలు) లేదా పాస్పోర్టు రీఇష్యూ కోసం ఇకపై రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు రూ.1,500గా ఉండేది. ఇక తత్కాల్ పథకం కింద ఇదే పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకునే వారి ఫీజు రూ.3,500 నుంచి రూ.5 వేలకు పెరిగింది. 60 పేజీల పాస్పోర్టు ఫీజు కూడా రూ.2 వేల నుంచి రూ.3,500కు పెరిగింది. తత్కాల్ పథకం కింద ఈ పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకునే వారు ఇకపై రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు రూ.4 వేలుగా ఉండేది.
పాస్పోర్టు పోగొట్టుకున్న సందర్భాల్లో కొత్త పాస్పోర్టు (36 పేజీలు) కోసం ఇకపై రూ.5 వేలు చెల్లించాలి. తత్కాల్ స్కీమ్లో బుక్ చేసుకుంటే రూ.7,500 చెల్లించాల్సి ఉంటుంది. 60 పేజీల పాస్పోర్టు విషయంలో ఈ ఫీజులు వరుసుగా రూ.6 వేలు, రూ.8,500 వేలకు పెరిగాయి. 18 ఏళ్ల పిల్లలకు కొత్త పాస్పోర్టు (36 పేజీలు) ఫీజు రూ.1,750గా నిర్ణయించింది. తత్కాల్ పథకం కింద ఈ పాస్పోర్టు కోసం ఇకపై రూ.4,250 చెల్లించాల్సి ఉంటుంది. మైనర్లు పాస్పోర్టు పోగొట్టుకున్న సందర్భాల్లో కొత్త పాస్పోర్టు కోసం రూ.4,250, తత్కాల్ స్కీమ్ కింద ఇదే పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే రూ.6,750 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మేరకు విదేశాంగ శాఖ పాస్పోర్టు నిబంధనలకు మార్పులు చేసింది. 2012లో చివరిసారిగా కేంద్రం పాస్పోర్టు ఫీజులను సవరించింది. సాధారణ విధానంలో దరఖాస్తు చేసుకుంటే 45 రోజుల్లోపు పాస్పోర్టు జారీ అవుతుందన్న విషయం తెలిసిందే. తత్కాల్ విధానంలో ఇంతకంటే త్వరగా పాస్పోర్టు పొందే అవకాశం ఉంది.
నటి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న వ్యాపారవేత్త..
భారత్లో 2030 నాటికి 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: అమెజాన్ సీఈఓ