
భారతీయ పాస్ పోర్టుల్ని (Passport) పౌరసత్వానికి గుర్తింపు కాదంటూ నిన్న షాకిచ్చిన కేంద్రం.. ఇవాళ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
పాస్ పోర్టుల దరఖాస్తులతో పాటు తత్కాల్ ఫీజుల్ని (Passport Fees) కూడా పెంచుతూ కేంద్రం ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పాస్ పోర్టు సేవా కేంద్రాల్లో జూలై 1 నుంచి ఈ పెంపు వర్తింపజేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే ఫీజులు ఎలా పెరిగాయో ఓసారి చూద్దాం..ఇవాళ విదేశీ వ్యవహారాల శాఖ జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం 2026 జూలై 1 నుండి అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ దరఖాస్తు రుసుములను పెంచింది.పాస్‌పోర్ట్స్ చట్టం 1967లోని సెక్షన్ 24 ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ, కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్స్ రూల్స్ 1980కి సవరణలను చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.కొత్త సవరణల ప్రకారం 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న దరఖాస్తుదారులకు, అలాగే ఈ విభాగం కింద దరఖాస్తు చేసుకునే 15-18 ఏళ్ల వయస్సు గల మైనర్లకు, సాధారణ విభాగంలో 36 పేజీల కొత్త పాస్‌పోర్ట్ లేదా పాస్‌పోర్ట్ పునరుద్ధరణ (రీ-ఇష్యూ) ఫీజుల్ని పెంచారు.ఈ కేటగిరీలు అన్నింటికీ ఇకపై పాస్ పోర్టు దరఖాస్తు ఫీజు రూ.2,500గా నిర్ణయించారు.అలాగే తాజా ఫీజుల విధానం ప్రకారం తత్కాల్ విభాగంలో ఫీజును రూ.5,000గా నిర్ణయించారు. అలాగే 60 పేజీల పాస్‌పోర్ట్ కోసం, సాధారణ దరఖాస్తులకు రూ. 3,500, తత్కాల్ దరఖాస్తులకు రూ. 6,000 చొప్పున ఫీజు ఉంటుందని నోటిఫికేషన్ లో తెలిపారు. దీంతో జూలై 1 నుంచి పాస్ పోర్టు పొందాలంటే దరఖాస్తుదారులు ఈ మొత్తాల్ని చెల్లించక తప్పదు.