
తెలుగు సినీ పరిశ్రమకు ఈ శుక్రవారం (జూన్ 26) కాస్త భిన్నంగా ఉండబోతోంది. కొత్త సినిమాలు విడుదల కాకుండా, ప్రధానంగా ఒక్కడు వంటి పాత హిట్ చిత్రాల రీ రిలీజ్లే థియేటర్లలో సందడి చేయనున్నాయి.
అయితే ఈ నిశ్శబ్దం ఎక్కువ రోజులు ఉండబోదు. జూలై నెలలో వరుసగా పలు చిత్రాలు, యువ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడనుంది. కొత్త కథలు, కొత్త ముఖాలు, వైవిధ్యమైన జానర్లతో జూలై నెల సినీ ప్రియులకు ఆసక్తికరంగా మారనుంది.
జూలై 3న రెండు విభిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సత్యదేవ్ హీరోగా నటించిన రావు బహదూర్ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య వంటి ప్రశంసలు పొందిన చిత్రాల తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మహేష్ బాబు సమర్పిస్తున్న ఈ చిత్రంపై కంటెంట్ ఆధారిత సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
మరోవైపు విరాట్ కర్ణ హీరోగా నటించిన నాగబంధం భారీ స్థాయిలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా కోసం భారీ సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్పై బడ్జెట్లో గణనీయమైన భాగం ఖర్చు చేసినట్లు సమాచారం. జూలైలో విడుదల కానున్న చిత్రాల్లో అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తోంది.
జూలై రెండో వారంలో రెండు కీలక చిత్రాలు విడుదల కానున్నాయి. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనివాస మంగాపురం జూలై 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్నారు. అలాగే బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని తెలుగు సినీ పరిశ్రమకు ఈ సినిమాతో పరిచయం కానుంది. తిరుపతి ప్రాంతం నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం యువతరాన్ని ఆకట్టుకునే ప్రేమకథగా తెరకెక్కింది.
అదే సమయంలో అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ కూడా విడుదల కానుంది. మూడు సంవత్సరాలకు పైగా విరామం తీసుకున్న అఖిల్, ఈ గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రంలో కొత్త లుక్లో కనిపించనున్నాడు. చిత్తూరు ప్రాంతం నేపథ్యంగా రూపొందిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల ద్వారా శ్రీనివాస మంగాపురం, లెనిన్ చిత్రాలు మంచి బజ్ను సొంతం చేసుకున్నాయి.
జూలై 24న కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ విడుదల కానుంది. గత కొన్నేళ్లలో ఆయన నుంచి వస్తున్న పూర్తి స్థాయి రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో కిరణ్ అబ్బవరం మధ్యతరగతి యువకుడి పాత్రలో కనిపించనుండగా, శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటించింది. బేబీ చిత్రంతో గుర్తింపు పొందిన సాయి రాజేష్ ఈ సినిమాకు కథా రచన చేయడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరించడం ఆసక్తిని పెంచుతోంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు ఇప్పటికే మంచి స్పందన లభించింది.
నెలాఖరులో, జూలై 31న సందీప్ కిషన్ నటించిన సిగ్మా విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ దర్శకుడు. తమిళ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశముంది.
మొత్తంగా చూస్తే, సూపర్ స్టార్ల ఆధిపత్యం కంటే యువ హీరోలు, డెబ్యూ హీరోలు, మీడియం బడ్జెట్ చిత్రాలతో జూలై 2026 ప్రత్యేకంగా నిలవనుంది. అఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక్క విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్ నటించిన లెనిన్ చిత్రానికి జూలై లో గట్టి పోటీ తప్పేలా లేదు.