
ఇటీవల విడుదలైన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు టాలీవుడ్లో కొత్త వివాదానికి తెరలేపాయి.
ఈ ఈవెంట్లో చిరు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని, వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి. చిరంజీవి తమ హీరోలను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
‘పెద్ది’ సక్సెస్ మీట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ‘చరణ్కు అవార్డ్ వచ్చినా రాకపోయినా.. అది పెద్ద సమస్య కాదు. అవార్డులు రావడానికి ఎన్నో దారులు ఉంటాయి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ‘పుష్ప’ సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ఇండైరెక్ట్గా బన్నీని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారంటూ మెగాస్టార్ను నెట్టింట ట్రోల్ చేయడం ప్రారంభించారు. “ఇంతవరకు జాతీయ అవార్డులు అందుకున్నవారంతా పక్క దారుల్లో గెలుచుకున్నవారేనా?” అంటూ బన్నీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఇదే ఈవెంట్లో చిరంజీవి నటనకు తనదైన శైలిలో డెఫినిషన్ ఇస్తూ ‘కేవలం ముఖ కవళికలతో నటిస్తే యాక్టింగ్ సంపూర్ణం కాదు. పాత్రలోకి పూర్తిగా లీనమైపోయి కళ్ళతో భావాలు పలికిస్తేనే నటన సంపూర్ణమవుతుంది“ అని చిరు అన్నారు. ఈ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్లో అద్భుతమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఇంటెన్స్ నటనతో ఆకట్టుకునే తారక్ సంపూర్ణ నటుడు కాదా? అంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పెద్ద స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం కామనే. కానీ, ‘పెద్ది’ ఘన విజయం సాధించి 20 రోజులు తర్వాత ఈ సక్సెస్ మీట్ వేదికగా చిరంజీవి ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు టాలీవుడ్ ఫ్యాన్ బేస్ల మధ్య పెద్ద అగ్గి రాజేసిందని చెప్పాలి.