
ప్రజా రాజధాని అమరావతిలో సినీ సందడి నెలకొంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 112వ చిత్రం నేడు వెలగపూడిలో లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు షాట్కు క్లాప్ కొట్టి షూటింగ్ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు.ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఏపీలో సినీ పరిశ్రమను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. అమరావతిలో సినిమా ప్రారంభోత్సవం జరగడం అదృష్టంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని కోరుకుంటున్నా" అని అన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు 'ముద్దుల మావయ్య జై బాలయ్య'కు ధన్యవాదాలు తెలిపారు.ఈ వేడుకలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్, చెరుకూరి సుధాకర్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజు తదితర సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజా రాజధానిలో భారీ సినిమా ప్రారంభోత్సవం జరగడం ఇదే తొలిసారి.