
ఎస్ఐఆర్ (SIR) విషయంలో సీరియస్గా లేకపోవడం పట్ల పలువురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఎస్ఐఆర్ అంశంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని ఫైర్ అయ్యారు. ఎస్ఐఆర్ తో బీజేపీ (BJP) కుట్ర చేస్తోందని, అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. ఎమ్మెల్యేలు (MLAs) నియోజకవర్గంలోనే ఉంటూ మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. తనకి ఒక నియోజకవర్గం కేటాయిస్తే వెళ్లి పనిచేస్తానని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఎమ్మెల్యేలు తీరు మారితే ఒకే అని, వారం రోజుల్లో తీరు మారకపోతే ఎమ్మెల్యేల స్థానంలో యాక్టివ్గా ఉన్న మరోవ్యక్తిని ఇన్ఛార్జిగా నియమిస్తామని సీఎం స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేయని వాళ్లు పార్టీకి అవసరం లేదని తేల్చిచెప్పారు. ఎస్ఐఆర్ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. పార్టీలో ఏ పదవిలో ఉన్నా ఎస్ఐఆర్ విషయంలో గ్రౌండ్ లెవల్కు వెళ్లి పనిచేయాల్సిందే అని అన్నారు. ఎవరెవరు పని చేయడం లేదో నా దగ్గర రిపోర్ట్ ఉంది. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే మీటింగ్లో పేర్లు చెప్పాల్సి వస్తుంది. పేర్లు చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు అని అన్నారు. ఇన్ఛార్జి మంత్రులు (Ministers) కూడా బాధ్యత తీసుకోవాలని, పనిచేయకపోతే ఇన్ఛార్జి మంత్రులను కూడా మారుస్తామని హెచ్చరించారు. జూమ్ మీటింగ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ఛార్జిలు పాల్గొన్నారు.