
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ లో ఆదివారం రాత్రి జరిగిన గ్రూప్-A మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో హర్మన్ప్రీత్ కౌర్...
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ లో ఆదివారం రాత్రి జరిగిన గ్రూప్-A మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.
టోర్నీని పాకిస్తాన్, నెదర్లాండ్స్పై అదిరిపోయే విజయాలతో ప్రారంభించిన భారత్కు ఈ ఓటమి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ ఒక్క ఓటమితో గ్రూప్-A సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు తలా 4 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. దీంతో సెమీఫైనల్ చేరే టాప్-2 స్థానాల కోసం పోటీ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది.
గ్రూప్లో మూడు జట్లు సమాన పాయింట్లతో ఉండటంతో ఇకపై నెట్ రన్ రేట్, విజయాల మార్జిన్ అత్యంత కీలకంగా మారాయి. భారత్ ప్రస్తుతం 3 మ్యాచ్లలో 4 పాయింట్లు సాధించి, +2.511 మెరుగైన నెట్ రన్ రేట్తో టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్, నెదర్లాండ్స్పై సాధించిన భారీ విజయాలు భారత్కు ఈ భారీ రన్ రేట్ ను అందించాయి.
ఇదే రన్ రేట్ ప్రస్తుతం భారత్ను రేసులో ముందుంచింది. అయితే, సౌతాఫ్రికా గెలిచినప్పటికీ వారి రన్ రేట్ -0.546 గా ఉంది. బంగ్లాదేశ్ రన్ రేట్ -0.641 గా ఉంది. ఆస్ట్రేలియా 3 మ్యాచ్లలో 3 విజయాలు, +4.391 రన్ రేట్తో 6 పాయింట్లు సాధించి దాదాపు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు అధికారికంగా సెమీస్ రేస్ నుండి అవుట్ అయ్యాయి.
భారత జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లాలంటే ఇకపై తదుపరి రెండు మ్యాచ్లలోనూ తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. భారత్ తన తదుపరి మ్యాచ్లలో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో తలపడనుంది. ఒకవేళ భారత్ ఈ రెండు మ్యాచ్లలోనూ విజయం సాధిస్తే, మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా సులభంగా సెమీస్ చేరుకుంటుంది.
ఒకవేళ భారత్ వచ్చే రెండు మ్యాచ్లలో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా, సౌతాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్లను భారీ తేడాతో గెలిస్తే టీమిండియా టోర్నీ నుండి అవుట్ అవుతుంది. కాబట్టి హర్మన్ప్రీత్ సేనకు ఇకపై ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే.
సౌతాఫ్రికా జట్టుకు ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్లో ఓటమి ఎదురైనా, ఆ తర్వాత పాకిస్తాన్, భారత్లపై గెలిచి రేసులోకి వచ్చింది. వారు తమ తదుపరి మ్యాచ్లలో నెదర్లాండ్స్, బంగ్లాదేశ్లతో ఆడనున్నారు. వారు 8 పాయింట్లు సాధించే అవకాశం ఉన్నా, వారి మైనస్ రన్ రేట్ వల్ల మిగిలిన మ్యాచ్లను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
మరోవైపు బంగ్లాదేశ్ జట్టు నెదర్లాండ్స్, పాకిస్తాన్లపై గెలిచినా ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో వారి రన్ రేట్ దెబ్బతింది. బంగ్లాదేశ్ తన తదుపరి మ్యాచ్లలో ఇండియా, సౌతాఫ్రికాలతో ఆడాల్సి ఉంది. కాబట్టి వారి సెమీస్ అవకాశాలు చాలా క్లిష్టంగా మారాయి.
గ్రూప్-A లో సెమీస్ చేరే జట్లు ఏవో తేలడానికి జూన్ 28న జరిగే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.
గత రికార్డులను పరిశీలిస్తే టీమిండియా 2018, 2023లలో సెమీఫైనల్ చేరగా, 2020లో ఫైనల్ వరకు వెళ్లింది. కానీ 2024 లో సెమీస్ చేరడంలో విఫలమైంది. ఈసారి ఎలాగైనా నాకౌట్ చేరాలని కసితో ఉన్న భారత్కు బంగ్లాదేశ్ను ఓడించడం సులువే అయినా, బలమైన ఆస్ట్రేలియాను లార్డ్స్ లో జరిగే లీగ్ చివరి మ్యాచ్లో ఢీకొట్టడం అతిపెద్ద సవాలుగా మారనుంది.