
కార్మికులు ఉంటున్న గదిలో గ్యాస్ను తనిఖీ చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది చెన్నై (పెరియపాళ్యం), న్యూస్టుడే: రొయ్యల ఎగుమతి కేంద్రంలో అమ్మోనియా వాయువు లీకై ఇద్దరు మహిళా కార్మికులు మృతిచెందగా, 143 మంది
అస్వస్థతకు గురైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరువళ్లూర్ జిల్లా పెరియపాళ్యం సమీపంలోని కన్నిగైప్పేర్లో ‘సెయింట్ పీటర్స్ పాల్ సీఫుడ్స్ ఎక్స్పోర్ట్’ పేరిట రొయ్యల ఎగుమతి పరిశ్రమ నడుస్తోంది. ఇందులో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సుమారు 300 మంది మహిళలు పనిచేస్తున్నారు. వారంతా అక్కడే పైఅంతస్తులో ఉంటారు. ఆదివారం మధ్యాహ్నం పరిశ్రమలో అమ్మోనియా వాయువు లీకవడంతో 145 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడక, ముక్కు, నోటి నుంచి రక్తం కారడంతో ఒడిశాకు చెందిన జామాని జుమాంగ్ (19), మాలోది (20) అనే మహిళా కార్మికులు ఘటనా స్థలిలోనే మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని గ్యాస్ లీకేజీని నియంత్రించారు. బాధితులను వివిధ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. రాష్ట్ర మంత్రి కుమార్, జిల్లా కలెక్టర్ కవిత ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. పెరియపాళ్యం పోలీసులు కేసు నమోదు చేసి సంస్థకు చెందిన డేనియల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సంస్థ యజమాని కోసం గాలిస్తున్నారు.
మృతదేహాలను ప్రభుత్వ ఖర్చుతో పంపండి: సీఎం విజయ్
చెన్నై: దుర్ఘటనపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పబ్లిక్ రిలీఫ్ ఫండ్ నుంచి అందించాలని, మృతదేహాలను ప్రభుత్వ ఖర్చుతో సొంత రాష్ట్రాలకు పంపించి అంత్యక్రియలు నిర్వహించడానికి చర్యలు చేపట్టాలన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కూడా ఆయన ఆదేశించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.