
Ind A vs SL A : భారత యువ క్రికెట్ జట్లు ఎక్కడ ఆడినా తమ అద్భుతమైన ప్రతిభతో దూసుకుపోతుంటాయి. ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరుగుతున్న ఇండియా-ఎ, శ్రీలంక-ఎ సిరీస్ ముగింపు దశకు చేరుకుంది.
ఆదివారం (జూన్ 21) ఇరు జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన టైటిల్ పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందే మైదానంలో జరిగిన ఒక పెద్ద వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. భారత 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని శ్రీలంక ఆటగాళ్లు కావాలనే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గత మ్యాచ్లో ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య మ్యాచ్ టై కావడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. ఆ ఉత్కంఠ భరిత సూపర్ ఓవర్ పోరులో శ్రీలంక-ఎ జట్టు భారత్పై విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా, లంక ఆటగాడు విశేన్ హలంబగే అతడిని ఉద్దేశించి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన వైభవ్ సూర్యవంశీ కూడా అంతే ఘాటుగా సమాధానమిచ్చాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కాస్తా నెట్టుకోవడాలు, తోపులాటల వరకు దారితీసింది. కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు క్రికెట్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి.
ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఫైనల్ మ్యాచ్కంటే ముందే శ్రీలంక-ఎ జట్టు కెప్టెన్ సహాన్ అరాచ్చిగే ఈ విషయంపై స్పందించాడు. వైభవ్ సూర్యవంశీని తాము కావాలనే టార్గెట్ చేస్తున్నామనే వార్తలను అతడు పూర్తిగా తోసిపుచ్చాడు. స్పోర్ట్స్టార్తో మాట్లాడిన సహాన్.. “మా ఆటగాళ్లు ఎవరినీ ప్రత్యేకంగా టార్గెట్ చేయడం లేదు. వాళ్లు కేవలం మ్యాచ్ను గెలవాలని, ఆటను ఎంజాయ్ చేయాలని మాత్రమే చూస్తున్నారు. సూపర్ ఓవర్ లాంటి అత్యంత ఒత్తిడితో కూడిన మ్యాచ్లలో భావోద్వేగాలు సహజంగానే బయటకు వస్తుంటాయి. ఇది క్రికెట్లో ఒక భాగం మాత్రమే” అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. తమ జట్టులో ఎంతో మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారని, మైదానంలో ఎలా ప్రవర్తించాలో వారికి బాగా తెలుసని చెప్పుకొచ్చాడు.
అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ, అంతర్జాతీయ క్రీడా నివేదికల ప్రకారం.. గొడవ జరుగుతున్న సమయంలో శ్రీలంక ఆటగాడు వైభవ్ను ఉద్దేశించి.. “ఇది ఐపీఎల్ కాదు.. బుద్ధిగా ఇంటికి వెళ్లు” అంటూ ఎగతాళి చేసినట్లు సమాచారం. ఈ మాట వినబడటంతోనే సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ సదరు లంక ప్లేయర్ను గట్టిగా తోసేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 15 ఏళ్ల కుర్రాడికి సోషల్ మీడియాలో భారత అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఫైనల్ మ్యాచ్లో లంక ఆటగాళ్లకు మనోడు బ్యాట్తోనే బుద్ధి చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ హైవోల్టేజ్ ఇండియా-ఎ వర్సెస్ శ్రీలంక-ఎ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (జూన్ 21) భారత కాలమానం ప్రకారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లంకలోని ప్రసిద్ధ రంగిరి దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా, తమ పాత బలమైన ప్లేయింగ్ ఎలెవన్తోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. టోర్నీలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్లో గెలిచి కప్పును ముద్దాడాలని టీమిండియా-ఎ పట్టుదలగా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..