
ఐటీ రంగంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో నేడు స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఐటీ రంగం ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సమస్యలకు ఇదో సంకేతమని మార్కెట్ నిపుణులు కామెంట్ చేస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్: దేశంలో స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
ట్రేడింగ్ మొదట్లో సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా నష్టపోగా నిఫ్టీ 200 పాయింట్లకు పైగా దిగజారింది. ఐటీ స్టాక్స్ అమ్మకాలు జోరందుకోవడంతో సూచీలు పడిపోయాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 783 పాయింట్లు నష్టపోయి 76,627 వద్ద కదలాడుతోంది.
218 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 23,949 వద్ద ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సీఎల్ తదితర సంస్థలు షేర్లు కుదేలవుతున్నాయి. ఐటీ రంగం ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సమస్యలకు ఇదో సంకేతమని మార్కెట్ నిపుణులు కామెంట్ చేస్తున్నారు.
టెక్ దిగ్గజం యాక్సెంచర్ ఆదాయం అంచనాలను అందుకోకపోవడంతో ఐటీ రంగంపై మదుపర్లలో ఆందోళన పెరిగింది. అమెరికా మార్కెట్లో కూడా యాక్సెంచర్ షేర్లు 17 శాతం మేర నష్టాలను ఎదుర్కొన్నాయి. ఏఐ తెస్తున్న మార్పులతో భవిష్యత్తులో కూడా ఐటీ రంగంలో ఇదే పరిస్థితి కొనసాగే ఛాన్స్ ఉందన్న అంచనాలు పెరిగాయి.
ఈ నేపథ్యంలో ఇన్ఫోనిస్ షేర్లు 7.3 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు కూడా దాదాపు 6 శాతం మేర నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ 6 శాతానికి పైగానే పతనమైంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 5 పైసల మేర తగ్గి 94.38 వద్ద కదలాడుతోంది.
15 ఏళ్లలో 3.78 లక్షల యూకే కార్ల దిగుమతికి అనుమతి