
Six Sixes Challenge: ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో భారత యువ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 79 బంతుల్లోనే 125 పరుగులు చేసి నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించాడు. అయితే ఈ అద్భుత ఇన్నింగ్స్ అనంతరం అతడు చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాలని కెప్టెన్ శుభ్మన్ గిల్ తనకు సవాలు విసిరాడని, ఆ ప్రయత్నమే తన డబుల్ సెంచరీ అవకాశాలను దెబ్బతీసిందని సరదాగా చెప్పాడు. మ్యాచ్ అనంతరం బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఇషాన్ కిషన్ మాట్లాడుతూ, “ఆరు సిక్సర్లు కొట్టే ప్రయత్నంలో నువ్వు నాకు 70-75 పరుగులు నష్టపరిచావు” అంటూ గిల్ను ఆటపట్టించాడు.
దీంతో ఇద్దరి మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. ఇషాన్ కిషన్ 113 పరుగులతో క్రీజులో ఉన్న సమయంలో మరో డబుల్ సెంచరీ సాధించే అవకాశాలు కనిపించాయి. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నాగేయల్య ఖరోటే వేసిన 37వ ఓవర్లో మొదటి బంతి వైడ్గా వెళ్లింది.
తర్వాతి రెండు బంతులను వరుసగా సిక్సర్లుగా మలిచిన ఇషాన్, ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదే ప్రయత్నం చేశాడు. అయితే మూడో బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో సరిగ్గా టైమ్ చేయలేకపోయాడు. బంతి నేరుగా డీప్ మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న ఇక్రమ్ అలీఖిల్ చేతుల్లో పడటంతో అతని అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది.
ఈ ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ తన దూకుడైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 52 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన అతడు, తర్వాతి 50 పరుగులను కేవలం 19 బంతుల్లోనే సాధించాడు. మొత్తంగా 71 బంతుల్లోనే శతకం పూర్తి చేసి తన విధ్వంసకర ఫామ్ను చాటుకున్నాడు.
బిలాల్ సమీ వేసిన ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మరోవైపు కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 77 బంతుల్లో తన తొమ్మిదో వన్డే సెంచరీ పూర్తి
చేసిన గిల్, భారత కెప్టెన్లలో అత్యంత వేగంగా సెంచరీలు సాధించిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అతడు 110 బంతుల్లో 154 పరుగులు చేసి భారత భారీ స్కోరుకు బలమైన పునాది వేశాడు. ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ కలిసి మూడో వికెట్కు 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది భారత జట్టు తరఫున వన్డేల్లో మూడో వికెట్కు నమోదైన నాలుగో అత్యధిక భాగస్వామ్యం. అయితే 1999 ప్రపంచకప్లో కెన్యాపై సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ నెలకొల్పిన 237 పరుగుల అజేయ భాగస్వామ్య రికార్డును అధిగమించడానికి కేవలం 13 పరుగుల దూరంలోనే నిలిచిపోయారు.
కాగా, మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 402 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ను 232 పరుగులకే ఆలౌట్ చేసి 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. సిరీస్లోని మూడో మరియు చివరి వన్డే జూన్ 20న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ టీ20 సిరీస్ల కోసం భారత జట్టుతో కలిసి ఇంగ్లాండ్కు వెళ్లనుండగా, శుభ్మన్ గిల్ ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్కు సన్నద్ధం కానున్నాడు.