పానీపూరి అంటే చాలా మందికి ఇష్టం. అయితే అది తయారు చేసే విధానం ఎలా ఉన్నా.. ఎగబడి తింటూనే ఉంటారు. చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలివాళ్ల వరకు పానీపూరిని చాలా ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు పానీపూరిని అశుభ్రమైన ప్రాంతాల్లో తయారు చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
తాజాగా సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఓ సంఘటన తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. పానీపూరి తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలు కావడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్లో ఈ సంఘటన జరిగింది.
సోమవారం రోజు సాయంత్రం దాదాపు 20 మందికి పైగా చిన్నారులు.. స్థానికంగా ఉన్న పానీపూరి బండి వద్ద గప్ చుప్లు తిన్నారు. అయితే వారందరికీ మంగళవారం తెల్లవారుజామున నుంచి పలు లక్షణాలు కనిపించాయి. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు కావడంతో..
వెంటనే అలర్ట్ అయిన వారి.. పిల్లలను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రితోపాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.అయితే పిల్లలకు ఏం అయిందో అర్థం కాక తల్లిదండ్రులు తీవ్ర అయోమయంలో పడ్డారు. మంగళవారం ఉదయం నుంచి చిన్నారులు ఒక్కొక్కరుగా అనారోగ్యం బారిన పడగా..
సాయంత్రం వరకు 20 మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరారు. దీంతో వారు ముందు రోజు తిన్న పానీపూరి కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని వారు ఒక నిర్ధారణకు వచ్చారు. దీంతో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇక అస్వస్థతకు గురైన చిన్నారుల్లో రిషికేష్ అనే బాలుడికి తీవ్ర జ్వరంతో ఫిట్స్ కూడా వచ్చినట్లు అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మరో 8 మంది చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అయితే.. పానీపూరీ తినడం వల్లే వాళ్లందరూ అస్వస్థతకు గురయ్యారని.. వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు
. పిల్లలు అందరికీ ఒకే రకమైన లక్షణాలు ఉండటంతో.. ఫుడ్ పాయిజన్ జరిగినట్లు డాక్టర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పానీపూరీ బండి నుంచి సేకరించిన ఆహార పదార్థాలను.. ల్యాబ్కు టెస్టింగ్ కోసం పంపించారు. ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే దానిపై స్పష్టత రానున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ ఘటనతో కేసీఆర్ నగర్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై స్పందించిన సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్.. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.