
హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం ఏపీ రాజకీయాల్లో మరింత ముదిరింది. ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా అత్యంత తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా చేసినవి కావని, వైసీపీ ఐదేళ్ల విఫల పాలనలో పెంచి పోషించిన విషపూరిత రాజకీయ సంస్కృతికి నిదర్శనమని ధ్వజమెత్తారు.ఐదేళ్ల వైసీపీ పాలనలో శాంతిభద్రతలు, అభివృద్ధిపై మాట్లాడటానికి ఆ పార్టీ నేతల వద్ద ఎలాంటి సమాధానాలు లేవని లోకేశ్ ఎద్దేవా చేశారు.
హోంమంత్రి పదవిలో ఉన్న ఒక మహిళను, అందులోనూ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకురాలిని పనిగట్టుకుని లక్ష్యంగా చేసుకోవడం వెనుక వైసీపీ వికృత రాజకీయం దాగి ఉందన్నారు.వంగలపూడి అనిత కష్టపడే తత్వానికి, ధైర్యానికి, నిరంతర ప్రజాసేవకు నిదర్శనమని లోకేశ్ కొనియాడారు. వైసీపీ నాయకులు ఎంతగా దూషించినా, బాడీ షేమింగ్ చేసినా ఆమె సాధించిన విజయాలను అస్సలు తగ్గించలేరని, ఆమె గొంతును నొక్కలేరని స్పష్టం చేశారు.
ఏపీ ప్రజలు ఇలాంటి ద్వేషపూరిత రాజకీయాలను ఎప్పుడో తిరస్కరించారని గుర్తుచేశారు. హోంమంత్రి అనితతో పాటు రాష్ట్రంలోని ప్రతి మహిళకు, ప్రతి దళితుడికి వైసీపీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు
.