
Electric Two Wheeler Star Ratings : దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
2026 మే నెలలో దేశవ్యాప్తంగా ఈ-టూవీలర్ల మార్కెట్ వాటా రికార్డు స్థాయిలో 9.3శాతానికి చేరిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్లకు శక్తి సామర్థ్యం (ఎనర్జీ ఎఫిషియెన్సీ) ఆధారంగా స్టార్ రేటింగ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (Bureau of Energy Efficiency) తయారీ సంస్థలతో చర్చలు ప్రారంభించింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే వినియోగదారులు వాహనం ఎంత విద్యుత్ వినియోగిస్తుందో, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుందో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై ఉన్న స్టార్ రేటింగ్ల తరహాలోనే ఈ వ్యవస్థను తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. దేశంలో పెట్రోల్ వినియోగంలో ద్విచక్ర వాహనాల వాటా అధికంగా ఉండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో ‘గో ఎలక్ట్రిక్’ ప్రచార కార్యక్రమాన్ని మరింత విస్తరించడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపడుతోంది
.