
వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తక్షణమే తొలగించాలని బీజేపీ నాయకులు పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన భారతీయ యువమోర్చా రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. ప్రస్తుత ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ బోగస్ ఓట్లను పూర్తిగా ఏరివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా యువమోర్చా శ్రేణులు చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రతి బూత్ పరిధిలో కార్యకర్తలు కనీసం 250 కుటుంబాలను సందర్శించి, ఓటర్ల జాబితాలోని వివరాలను క్షుణ్ణంగా సరిచూడాలని సూచించారు.రాష్ట్రంలో దేశ వ్యతిరేక శక్తులు, అనుమానాస్పద బృందాల కార్యకలాపాలు పెరిగాయని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మాధవ్ హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం సాధిస్తున్న అప్రతిహత ప్రగతిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని ఆయన విమర్శించారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు గళం విప్పుతామని ఆయన స్పష్టం చేశారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తీరప్రాంతంలో 10 లక్షల తాటిచెట్లను నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. యువమోర్చా నాయకులు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన కార్యాచరణ (క్యాలెండర్) రూపొందించుకోవాలని మాధవ్ దిశానిర్దేశం చేశారు
.