ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ , నారా భువనేశ్వరి మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. అమ్మంటే తనకు ఎంత ప్రేమ ఉందో పలు సందర్భాల్లో నారా లోకేష్ ప్రజలతో పంచుకున్నారు. అలాగే భువనేశ్వరి సైతం నారా లోకేష్ క్రమశిక్షణ, పనితీరును ప్రశంసించిన ఘటనలు కూడా అనేకం. అయితే ఇప్పుడీ విషయం ఎందుకంటే అమ్మ గురించి, అమ్మ ప్రేమ గురించి నారా లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి సంబంధించిన వీడియోకు నారా లోకేష్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అసలేం జరిగిందంటే..టీమిండియా, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య శనివారం ధర్మశాల వేదికగా తొలి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి సిరీస్లో శుభారంభం చేసింది. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లు విలేకర్ల సమావేశంలో పాల్గొనటం సర్వసాధారణం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం భారత జట్టు నుంచి ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి వచ్చారు. రిపోర్టర్లు ఆయనను ప్రశ్నలు అడుగుతున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది. కొడుకు విలేకర్ల సమావేశంలో ఉన్న సంగతి తెలియని నితీష్ కుమార్ రెడ్డి తల్లి.. ఆయనకు ఫోన్ చేసింది. అమ్మ నుంచి ఫోన్ వస్తున్న విషయాన్ని గమనించిన నితీష్ కుమార్ రెడ్డి.. కాసేపు విలేకర్ల సమావేశం ఆపేశారు. ఫోన్ లిఫ్ట్ చేసి.. ఐదు నిమిషాల్లో మళ్లీ చేస్తానమ్మా అని తెలుగులో బదులిచ్చారు. ఆ తర్వాత విలేకర్లకు క్షమాపణలు చెప్పిన ఆయన.. ప్రెస్ మీట్ కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు రిప్లై ఇచ్చిన నారా లోకేష్.. క్రికెట్ అయినా, ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా అమ్మే ఫస్ట్ .. వెల్ ప్లే నితీష్ అంటూ ట్వీట్ చేశారు. ఈ
ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఢిల్లీకి రాజైనా, తల్లికి కొడుకే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం అంతరాయం కలిగించటంతో 25 ఓవర్లకు కుదించారు. అఫ్గానిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 194 పరుగులు చేయగా.. భారత జట్టు సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. 22.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. గిల్ 84, రాహుల్ 39 పరుగులతో సత్తాచాటారు. ఈ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబెలకు చెరో మూడు వికెట్లు దక్కాయి. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది.