
ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో జనగణమన, వందేమాతరం అలాగే భగవద్గీత శ్లోకాలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. జూన్ 16 నుంచి ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు జూన్ 13 శనివారం రోజున టైమ్ టేబుల్ రిలీజ్ చేసింది. రోజుకు మూడు సార్లు విద్యార్థులంతా ఒకే చోట చేరి జనగణమన, వందేమాతరం అలాగే గాయత్రి మంత్రం పఠించాలని అందులో పేర్కొంది. మూడు స్లాట్ లను రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థుల కోసం రూపొందించింది. జనగణమన, వందేమాతరంతో పాటుగా దీప్ మంత్ర, సరస్వతి వందన, గురు మంత్ర, అలాగే మహా పురుష చరిత్ర తదితర శ్లోకాలను ఉదయం పాఠశాల ప్రారంభం అయ్యే ముందు జరిగే ప్రేయర్ లో వరుస క్రమంలో పఠించాలని స్పష్టం చేసింది. ఇక లంచ్ బ్రేక్ లో విద్యార్థులు అంతా కలిసి జాతీయ గీతం, గాయత్రి మంత్రం తదితర శ్లోకాలను పఠించాలని పేర్కొంది. స్టడీస్ తో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, నైతిక విలువలు, భారత సంస్కృతి, సంప్రదాయాల్ని పెంపొందించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ తాజాగా రాష్ట్రంలోని జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 16 నుంచి క్రమం తప్పకుండా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఈ టైమ్ టైబుల్ కచ్చితంగా పాటించాలని లేదంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. అయితే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దుతోందని ప్రతిపక్ష
కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. భారత్ సెక్యూలర్ దేశం అని.. ఐడియాలజీ, ఎజెండాలను ప్రోత్సహించడం రాజ్యాంగబద్ధంగా విరుద్ధం అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుషీల్ ఆనంద్ శుక్లా స్పష్టం చేశారు. ఇదే వ్యవహారంపై బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ చిమ్నానీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భావి తరాల విద్యార్థులకు భారతీయ సంస్కృతులు, సంప్రదాయాలు అలవాటు అవుతాయని తెలిపారు.