
Medicine Price Hike : పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో క్యాన్సర్ నివారణ మందుల తయారీకి వినియోగించే ముడి ప్లాటినం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగాయి. దీంతో మెడిసిన్ల తయారీ కంపెనీలకుపై భారం
పడుతోంది. ఈ క్రమంలో మందుల ధరలను పెంచలేక.. మందుల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను కొనుగోలు చేయలేక కంపెనీలు మెడిసిన్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. ఈ క్రమంలో మెడిసిన్ల కొరతతో క్యాన్సర్ రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో వారికి ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో మెడిసిన్ల పై ధరల భారాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దేశవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులు ఎదుర్కొంటున్న మందుల కొరతకు స్వస్తి చెప్పేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మెడిసిన్ల తయారీ కంపెనీలకు ధరల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కంపెనీలపై భారం తగ్గి, క్యాన్సర్ మెడిసిన్ల మందులు ఉత్పత్తి మళ్లీ పుంజుకోనుంది. క్యాన్సర్ రోగులకు అత్యంత అవసరమైన రెండు కీమోథెరపీ మందులతో పాటు మొత్తం నాలుగు రకాల ఔషధాల ధరలను పెంచేందుకు నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ)కు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
కేంద్రం తాజా నిర్ణయంతో ప్లాటినం అధారిత కీమోథెరపీ ఇంజెక్షన్లు ‘సిస్ఫాటిన్, కార్బోప్లాటివ్’లతో పాటు రెండు రకాల ధనుర్వాతం (యాంటీటెటానస్) ఇంజెక్షన్ల ధరలు పెరగనున్నాయి. వీటిని నోరు, ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయ ముఖద్వారం (సెర్వికల్) వంటి వివిధ రకాల క్యాన్సర్ల చికిత్సలో ప్లాటినం అధారిత కీమోథెరపీ మందులను మొదటి ప్రాధాన్యతగా వాడుతుంటారు. ఇవన్నీ అత్యవసరమైన మెడిసిన్ల జాబితాలోకి వస్తాయి. అయితే, వీటి ధరలు పాత ధర కంటే 10 శాతం నుంచి 50శాతంలోపు మాత్రమే ఉండేలా చూడాలని ఎన్పీపీఏకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే మరో 78 రకాల ఔషధాల ధరల పెంపు ప్రతిపాదనలపై నిపుణుల కమిటీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.